సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఐదు నిమిషాల శారీరక సుఖం కోసం.. కామంతో కళ్లు మూసుకుపోయి బంధాలకు తిలోదకాలిచ్చి పక్కవారిపై మోజు పెంచుకుంటున్నారు.. కొందరు. అలా పక్కచూపులు చూశాక ఊరుకుంటున్నారా! అంటే అదీ కాదు.. భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను కడతేర్చే దాకా వెళ్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి రంగా రెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14ఏళ్ల క్రితం పటాన్ చెరువు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్ పల్లి మండలం టంగటూర్ లో దానిమ్మ తోట లీజు తీసుకున్నాడు. అక్కడికి వారానికోసారి వచ్చి వెళ్తుండేవాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్ ట్రైనర్ తిరుపతిరావు (25)తో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో.. రోజు కలుసుకునేవాళ్ళు. దీంతో అనుమానమొచ్చిన శంకరయ్య, భార్యను పద్ధతిగా ఉండాలంటూ హెచ్చరించాడు.
అంతే.. దీన్ని సహించలేకపోయిన జయసుధ, భర్త నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని. అతణ్ని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పింది. ఇద్దరూ కలిసి శంకరయ్య హత్యకు పక్కా ప్లాన్ వేశారు. ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని.. చంపాలని ప్రియుడుకి చెప్పింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా.. టంగటూర్ గ్రామ శివారులో తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసి పరారయ్యాడు.. ప్రియుడు. ఈ ఘటనపై పిర్యాదు అందుకున్న పోలీసులు.. భార్యపై అనుమానమొచ్చి తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం చెప్పింది. దీంతో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
ఇది కూడా చదవండి: Tirupati: వరకట్న పిశాచి.. కిలో బంగారం, 10కిలోల వెండి.. రూ.50 లక్షలతో పెళ్లి.. అయినా సరిపోలేదు.. చివరకు!