నాగార్జున హీరోగా నటించిన చిత్రం శివమణి ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీతి నిజాయితీలతో పని చేస్తూ.. రౌడీల గుండెల్లో సింహ స్వప్నంలా నిలిచాడు. అది సినిమా కాబట్టి.. హీరో అంత నిజాయతీగా ఉన్నాడు. మరి వాస్తవంగా అలా ఉండే పోలీసులు ఉంటారా.. అంతటి ఆదరాభిమానులు సంపాదించుకున్న పోలీసు అధికారి ఎవరైనా ఉన్నారంటే.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు చిత్తూరు సీఐ రుషికేశవ. నిజాయతీగా పనిచేశారు. నేరస్తులకు సింహస్వప్నంగా నిలిచారు. పోలీసు శాఖకు వన్నె తెచ్చారు. ప్రజల్లో గుండెల్లో నిలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘శివమణి’గా పేరు తెచ్చుకున్నారు. ఇంతటి ఆదరాభిమానులు పొందిన వ్యక్తి నెల రోజలు క్రితం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు వేలల్లో జనాలు హాజరయ్యారు. నిజమైన ప్రజాభిమానం అంటే ఇది అంటూ రిషి కేశవ గురించి గొప్పగా చెప్పుకున్నారు. అతడి వివరాలు..
శివమణిగా గుర్తింపు ఇలా..
అనంతపురానికి చెందిన రుషికేశవ 2002లో ఎస్ఐగా చేరారు. తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, గంగవరం, పీటీఎం, తంబళ్లపల్లెల్లో పనిచేశారు. 2013లో సీఐగా పదోన్నతి పొందారు. చిత్తూరు డీటీసీ, టాస్క్ఫోర్స్, ములకలచెరువు, చిత్తూరు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్లో పనిచేశారు. 2004లో పెద్దపంజాణి, పుంగనూరులో ఎస్ఐగా ఈయన నేరస్థుల ఆట కట్టించారు. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అన్యాయం జరిగిందని తెలిస్తే ఎంతటి వారినైనా జైలుకు పంపించారు.
సివిల్ దుస్తులు, మారువేషాల్లో గ్రామాల్లో తిరుగుతూ నాటుసారా తయారీ, పేకాట, కోడిపందెం స్థావరాలపై దాడులు నిర్వహించారు. నిందితులను అరెస్టు చేసేవారు. మహిళా కేసుల విషయంలో సీరియ్సగా ఉండేవారు. ఆ సమయంలో నాగార్జున నటించిన శివమణి సినిమా విడుదలైంది. నీతినిజాయితీగా పనిచేస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్న రుషికేశవకు ప్రజలే శివమణిగా నామకరణం చేశారు. ఉన్నతాధికారులూ అలాగే పిలిచేవారు. ఈయన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు.
పలువురికి సాయం..
ములకలచెరువు సీఐగా రుషికేశవ ఉన్నప్పుడు పొలాల్లో భారీగా మోటార్లు, స్టార్టరు పెట్టెలు చోరీకి గురయ్యాయి. దీంతో పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందిపడతారనే ఉద్దేశంతో ఆయనే సొంత డబ్బుతో తంబళ్లపల్లె, ములకలచెరువు, పీటీఎం, పెద్దమండ్యం మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ సామగ్రి వితరణ చేశారు. పేద విద్యార్థులకు రూ.5-10 వేల వరకు ఉపకార వేతనాలు అందించారు.
ప్రజల పోలీసుగా..
ఎస్ఐగా పుంగనూరు నుంచి 2006లో మొలకలచెరువుకు బదిలీ కాగా.. దానిని రద్దు చేయాలంటూ పుంగనూరులో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేశారు. మరికొందరు యువకులు గుండు కొట్టుకుని నిరసనలు తెలిపారు. ఆయన ప్రజలకు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత, 2009 ఎన్నికల సందర్భంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రచారానికి పుంగనూరు వచ్చారు. ఆ సమయంలో బందోబస్తుగా రుషికేశవ ఇక్కడకు రావడంతో అభిమానులు భారీ ఎత్తున ఆయనపై పూలవర్షం కురుపిస్తూ పైకి ఎత్తుకుని ఊరేగించారు. అంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన రుషికేశవ.. పోలీసు శాఖకు వన్నె తెచ్చారు. స్ఫూర్తిగా నిలిచారు.
ఏడాదిన్నర కిందట కర్నూలు సీబీసీఐడీకి బదిలీపై వెళ్లిన ఆయన.. ఏడాది కిందట అనారోగ్యంపాలై మెడికల్ లీవ్లో ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, వేలూరు సీఎంసీ, తిరుపతి, మదనపల్లె ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. కొద్దిరోజులుగా మదనపల్లెలోని రోజా ఫ్లాట్స్లో నివాసముంటూ చికిత్స తీసుకుంటున్నారు. రెండురోజుల కిందట పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఈయనకు భార్య సుశీల, కుమారుడు జయసింహ, కుమార్తెలు పల్లవి (ఎంబీబీఎస్), ఇంటర్ చదువుతున్న రోహిత ఉన్నారు. మరి రియల్ హీరోగా పేరు పొందిన రిశి కేశవ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.