ప్రజాభిమానం.. ఈ పదానికి ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. ఓ వ్యక్తిని శక్తిగా మార్చగలిగే సత్తా ప్రజాభిమానానికి ఉంది. ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ఈ ప్రజాభిమానమే వ్యక్తులని స్టార్లుగా, తిరుగులేని నేతలుగా నిలుపుతుంది. అంతేందుకు.. నాడు ఎన్టీఆర్కున్న అశేష ప్రజాభిమానం కారణంగానే ఆయన పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే సీఎం కుర్చీ ఎక్కగలిగాడు. అదే ప్రజాభిమానం ఎదురుతిరిగి.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో అందరికి తెలుసు. ప్రజలు అభిమానిస్తున్నారు కదా అని.. తోచినట్లు చేయడం.. ఎడాపెడా వారికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటే.. అభిమానులే ఎదురు తిరుగుతారు. ఇదిగో అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది అధికార వైసీపీ పార్టీకి. అది కూడా సీఎం జగన్ సొంత జిల్లాలో. ప్రజలు వ్యతిరేకిస్తే.. ఇక నేతలు మాత్రం ఏం చేయలగల్గుతారు. చివరకు వారు కూడా జనాలకు మద్దతిచ్చి.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సి వచ్చింది. ఇంతకు ఏమా నిర్ణయం.. ఎందుకు ప్రజలు ఎదురు తిరిగారు వంటి వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట చెత్త పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. స్వయంగా సీఎం జగన్ సొంత జిల్లాలోనే ప్రజలు చెత్త పన్ను వసూలు చేయడానికి వచ్చిన అధికారులపై ఎదురు తిరిగారు. కడప కార్పొరేషన్లో క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా చెత్తపన్ను వసూళ్లు చేయడాన్ని ఆ నగర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెత్త పన్ను వసూళ్లకు వెళ్లిన సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం చేసి, వారిని వెనక్కి పంపారు. ఈ సంగతి తెలిసి కడప కార్పొరేటర్లు అవాక్కయ్యారు.
వీరంతా వైఎస్సార్సీపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చెత్తపన్ను వసూళ్లపై ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కార్పొరేటర్లు ప్రయత్నించారు. వెంటనే మేయర్ సురేష్బాబు దగ్గరికి పరుగు పెట్టారు. ప్రజల్లో చెత్తపన్నుపై వస్తున్న వ్యతిరేకత గురించి వివరించారు. చెత్తపన్ను వసూళ్లను నిలుపుదల చేయాలని మేయర్కు విన్నవించారు. చెత్తపన్ను వసూళ్లకు సంబంధించి ఏవైనా మార్పులు చేసిన తర్వాతే క్లాప్ పథకాన్ని అమలు చేయాలని మేయర్కు విన్నవించారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వైసీపీ నేతలు ఊహించలేదు. ఈ విషయంలో బలవంతపు నిర్ణయాలు తీసుకుని.. మొండిగా ముందుకు వెళ్తే తమకే నష్టం అని గుర్తించారు. అందుకే బలవంతంగా ప్రజలపై ఈ పన్నును రుద్దడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే.. మరో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభం అయితే.. అది ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో గ్రహించి వెనకడుగు వేశారు. ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పునరాలోచించాలని మేయర్కు సొంత పార్టీ కార్పొరేటర్లు విన్నవించడం ఆసక్తికర పరిణామం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.