ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 6 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో 2,58,449 మంది ఉత్తీర్ణత కాగా.. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది పాస్ అయ్యారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 72 శాతం ఉత్తీర్ణత నమోదవగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 50శాతం మంది పాసయ్యారని అన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉందని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.