వ్యభిచార గృహాలకు డబ్బులిచ్చి విటులుగా వెళ్లే వారికి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డబ్బులు కట్టి ఒక కస్టమర్ గా వెళ్లే వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెట్టడం, అతనిడి విచారించేందుకు వీల్లేదంటూ తీర్పు వెలువరించింది. 2020లో గుంటూరు నగరంపాలెం పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు గుంటూరులోని మొదటి తరగతి జ్యుడీషియల్ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ కేసును రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిటీషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ ఈ తీర్పును వెలువరించారు.
ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్తకు షాకిచ్చిన భార్య!
వివరాల్లోకి వెళ్తే.. 2020 అక్టోబర్ 10న గుంటూరు నగరంపాలెం పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ కేసును రద్దు చేయాలంటూ హైకోర్టులో ఆ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషినర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 2020లో పిటిషినర్ పై కేసు నమోదు చేశారని. తర్వాత దర్యాప్తు జరిపి సంబంధిత కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారని తెలిపారు. అయితే వ్యభిచార గృహంపై దాడి చేసిన సమయంలో పిటిషినర్ కస్టమర్ గా ఉన్నట్లు పోలీసులు ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యభిచారం నిర్వహించే వారిపై, వ్యభిచారం కోసం ఇంటిని ఇచ్చే వారిపై మాత్రమే కేసు పెట్టే అవకాశం ఉందన్న విషయాన్ని న్యాయవాది ప్రస్తావించారు.సొమ్ము చెల్లించి వెళ్లే విటుడిపై కేసు పెట్టి, విచారణ జరిపే అధికారం లేదని నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు. గతంలోనూ అదే తరహా కేసును ఏపీ హైకోర్టు కొట్టేసిన విషయాన్ని గుర్తుచేశారు. పిటిషనర్ కేవలం కస్టమర్ మాత్రమే అని అదనపు పీపీ తెలిపారు. పోలీసులు అభియోగపత్రం, గతంలో హైకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా ఈ కేసును రద్దు చేయాలని పిటిషనర్ తరఫు అడ్వకేట్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న అనంతరం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ పిటిషినర్ పై ఉన్న కేసును రద్దు చేశారు. వ్యభిచార గృహానికి కస్టమర్ గా వెళ్లిన విటుడిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.