నేటి సమాజంలో మనం తినే ఆహార పదార్థాలు చాలా వరకు జంగ్ ఫుడ్ తో కూడినవే.. ఎక్కడ చూసినా కలుషితం. చక్కటి ఆరోగ్యానికి చిట్కాలు తాజా పండ్లు అని సూచిస్తుంటారు. సీజనల్ లో దొరికే పండ్లలో ఒకటి సీతా ఫలం. అయితే సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం ఈ పేర్లు మీరు వినే ఉంటారు. సాధారణంగా తెలుగు ప్రజలకు ఎక్కువ తెలిసింది మాత్రం సీతాఫలమనే చెప్పవచ్చు. అయితే సీతాఫలం కంటే మిన్నగా పోషకాలుండే పండు మాత్రం రామఫలమనే చెప్పవచ్చు.
సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు చాలా తక్కువగా ఉండి పోషకాలు అధికంగా లభిస్తాయి. వంద గ్రా. రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రా. కార్బొహైడ్రేట్లు, 1.5గ్రా. ప్రొటీన్లు, 3గ్రా. పీచూ లభ్యమవుతాయి. ఇందులో సి- విటమిన్తో పాటు బి-కాంప్లెక్స్లోని పైరిడాక్సిన్ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపటంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. తీపి విషయానికి వస్తే సీతాఫలం కన్నా రామాఫలంలో తియ్యదనం తక్కువగా ఉంటుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తినొచ్చు. ఇందులోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రామాఫలంలోని విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి ముఖంపై మొటిమలను నివారిస్తాయి. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ బి1, బి2, బి5, బి3, బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే తెలుగు రాష్ట్రాలలోపాటు కర్ణాటక, తమిళనాడు. కేరళ రాష్ట్రాల్లో రామఫలాలు అందుబాటులోకి వచ్చాయి.