ప్రస్తుతం ఎటు చూసినా ట్రాఫిక్ సమస్యే. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో.. కాలుష్యం ఒకవైపు.. మరోవైపు ట్రాఫిక్ సమస్య. వీటికి తోడు కొందరి నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ సమస్యలు మరీ ఎక్కువవుతున్నాయి. అయితే.. ఈ సమస్య ఇప్పటివరకు పెద్దవారినే ఇబ్బంది పెట్టేది. తాజాగా ఓ పిల్లాడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి బాబోయ్ అంటూ..పోలీసులను ఆశ్రయించాడు. యూకేజీ చదువుతున్న ఆరేళ్లు ఈ బుడ్డోడు.. తమ స్కూల్ దగ్గర రోడ్డు తవ్వి ట్రాక్టర్లను అడ్డు పెట్టారని.. తమందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయని మీరు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పలమనేరులో జరిగింది.
స్థానికంగా ఉన్న ఆదర్శ ప్రైవేట్ స్కూల్ లో యూకేజీ చదువుతున్న కార్తికేయ.. తమ స్కూలు దగ్గర జెసీబీతో రోడ్డు తవ్వేసి ట్రాక్టర్లను అడ్డుగా పెట్టారని పోలీసులకు సమస్యను వివరించాడు. ఇలా చేయడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని.. పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేయాలని కోరాడు. అయితే.. బుడ్డోడి చురుకుదనం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు బాలుడితో సరదాగా కాసేపు ముచ్చటించారు. తామంతా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తామని బాలుడికి హామీనిచ్చారు. ఈ సందర్భంగా బాలుడికి స్వీట్ తినిపించి ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడినుంచి పంపించారు. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలుడు ప్రశ్నించిన విధానం.. పోలీసులతో ముచ్చటించిన తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది.