క్రికెట్ మైదానంలో అప్పుడప్పు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు వివాదాలకు దారితేస్తే.. మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇక మైదానంలో కెప్టెన్స్ తమ వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థిని బొల్తా కొట్టించాలని చూస్తూంటారు. ఈ క్రమంలోనే కొంత మంది కెప్టెన్లు ప్రత్యర్థి ఆటగాడి పరువు తీసేలా ఫీల్డింగ్ సెటప్ చేస్తుంటారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ లో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్.. ధోని బ్యాటింగ్ అప్పుడు అతడి చుట్టూ ఫీల్డ్ సెటప్ చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా అలాంటి ఫీల్డ్ సెటప్ చేసిన ఓ మ్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
యూరప్ క్రికెట్ ఛాంపియన్ షిప్ 2022లో భాగంగా తాజాగా ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నార్వే జట్టు ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి నార్వే జట్టు కెప్టెన్ ఫీల్డింగ్ సెటప్ ను మార్చాడు. దాంట్లో ఏముంది? అందరు కెప్టెన్స్ ఆటలో చేసేది అదేగా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది అదికాదు.. నార్వే జట్టు ఫీల్డర్లందరిని స్లిప్ వైపే మోహరించింది. కీపర్ నుంచి మెుదలుకుని అతడిని అనుసరిస్తూ.. ఓ రైలు పెట్టెలా ఫీల్డర్లు అంతా నిలుచున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే? అక్కడి మైదానంలోని పరిస్థితిని చూస్తే.. అది లాస్ట్ ఓవర్, ఏదో ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్ లా లేదు.
ఈ క్రమంలోనే నార్వే కెప్టెన్ మాత్రం ఎందుకిలా ఫీల్డ్ సెటప్ చేశాడో అర్దం కావట్లేదని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఫీల్డింగ్ అయితే పెట్టాడు కానీ పరుగులు రాకుండా మాత్రం బ్యాటర్ ని ఆపలేకపోయాడు. ఇక బౌలర్ కూడా ఫీల్డ్ సెటప్ కు తగ్గట్లే ఆఫ్ సైడ్ ఫుల్ లెన్త్ బాల్ వేశాడు.. కానీ బ్యాటర్ దాన్ని అద్బుతంగా ఆడి రన్స్ రాబట్టాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ స్పందిస్తూ..”ఇలాంటి ఫీల్డింగ్ సెటప్ ను ఇంతవరకు ఎక్కడా చూడలేదు.. కానీ ఏం లాభం రన్స్ ఇచ్చారు”. “భయ్యా ధోని కూడా ఇలాంటి ఫీల్డ్ సెటప్ చేయలేదు.. నీకో దండం” అంటూ సరదాగా స్పందిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఇలాంటి సరదా సన్నివేశాలు మ్యాచ్ ల్లో జరగడం సర్వసాధారణమే అని మరికొంత మంది క్రీడాభిమానులు స్పందిస్తున్నారు.