మనదేశంలో మహిళలు ఎన్నికల్లో విజయం సాధించినా సరే.. వారి బదులు.. సదరు మహిళా నేత ఇంటిలోని మగవారు పెత్తనం చేయడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇక కొన్ని చోట్ల తండ్రి ఉన్నతాధికారి, ఎంపీ, ఎమ్మెల్యేగా ఉంటే.. ఇక కొడుకులే పెత్తనం చెలాయిస్తుంటారు. ఈ కోవకు చెందిన సంఘటనలు ఇప్పటికే అనేకం వెలుగులోకి రాగా.. తాజాగా మరో సంఘటన వెలుగు చూసింది. ఏకంగా సీఎం కుర్చిలో కూర్చుని.. పెత్తనాలు వెలగబెట్టాడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. ఇక అధికారులంతా.. ఆయన చుట్టూ చేరి.. చేతులు కట్టుకుని నిలబడి.. చిన్నసారు చెప్పేది శ్రద్దగా వింటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. ఆ వివరాలు..
ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు.. శ్రీకాంత్ షిండే.. ఇలా సీఎం కుర్చిలో కూర్చుని ఉన్నాడు. శ్రీకాంత్ షిండే.. సీఎం ప్లకార్డుతో ఉన్న స్థానంలో కూర్చొని ఉండగా.. అతడి ఎదురుగా కొంత మంది అధికారులు నిల్చుని ఉన్నారు. ఇక ఈ ఫోటోలో శ్రీకాంత్ షిండే ముందు కొన్ని డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవికాంత్ వర్పే ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఇవి వైరలవుతున్నాయి. ‘సూపర్.. సీఎం అయినందుకు శ్రీకాంత్ షిండేకు శుభాకాంక్షలు’ అంటూ సెటైర్స్ వేశారు. ‘ప్రజాస్వామ్యం కూనీ అవుతోంది. ఇదెక్కడి రాజధర్మం?’ అంటూ మరాఠీలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
खा.श्रीकांत शिंदे यांना सुपर सीएम झाल्याबद्दल हार्दिक शुभेच्छा.
मुख्यमंत्र्यांच्या गैरहजेरीत त्यांचे चिरंजीव मुख्यमंत्री पदाचा कारभार सांभाळतात.लोकशाहीचा गळा घोटण्याचे काम सुरूय.हा कोणता राजधर्म आहे?असा कसा हा धर्मवीर?@mieknathshinde @DrSEShinde pic.twitter.com/rpOZimHnxL— Ravikant Varpe – रविकांत वरपे (@ravikantvarpe) September 23, 2022
ఈ వివాదంపై శ్రీకాంత్ షిండే స్పందించాడు. కావాలనే కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఖండించాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో.. నా ఇంట్లో తీసింది. నేను కూర్చింది ప్రభుత్వ ఆఫీస్లో కాదు.. మా ఇంట్లో. ఇక నా వెనుక మీరు చూస్తున్న సీఎం ప్లకార్డ్ కూడా ముఖ్యమంత్రి నేడు పాల్గొనబోయే మీడియా సమావేశం కోసం చేసిన తాత్కాలిక ఏర్పాటు. పైగా, ఆ ప్లకార్డు నా కుర్చీ వెనుక లేదు. ఓ పక్కన ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఈ ఫోటో వ్యవహారం మాత్రం మహారాష్ట్రలో పెద్ద వివాదాన్నే రాజేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.