అబార్షన్ విషయంలో సుప్రీం కోర్టు సంచల తీర్పు ఇచ్చింది. అబార్షన్ తమ ఇష్టం ప్రకారమే నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉందని తెలిపింది. ఇదే సందర్బంగా సుప్రీం కోర్టు అనేక కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్ మహిళలు చేయించుకోవచ్చని తెలిపింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్ ను అడ్డుకోవడం చట్ట విరుద్ధం అని వ్యాఖ్యానించింది. ఎంపీటీ చట్టం ప్రకారం పెళ్లికాని మహిళ అబార్షన్ చేయింకోవచ్చని సుప్రీం కోర్టు ధర్మాసన తెలిపింది. ఇదే సమయంలో భార్యతో బలవంతగా చేసే సె*క్స్ కూడా రేప్ కిందకే వస్తుందని కూడా తీర్పు ఇచ్చింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నాడు ఈ కీలక తీర్పులను వెల్లడించింది.
పెళ్లైన మహిళలకు సంబంధించి సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. “భార్యతో బలవంతపు సెక్స్ చేస్తే.. అది రేప్ కిందికే వస్తుంది. భార్యపై బలవంతపు శృంగారం అత్యాచారంగానే పరిగణించాలి. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిణించాలి. బలవంతపు సెక్స్ ద్వారా కలిగే గర్భాన్ని తొలగించుకునే హక్కు భార్యకు ఉంటుంది’ అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అలాగే అసురక్షిత గర్భస్రావాలపై కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసురక్షిత గర్భస్రావాలు ప్రసూతి మరణాలకు ఓ ప్రధాన కారణమని, దేశంలో జరుగుతున్న అబార్షన్లలో 60 శాతం సురక్షితం కాదని తెలిపింది. సురక్షితమైన అబార్షన్ సేవలకు నిరాకరించడం ద్వారా నిర్బంధ అబార్షన్ పద్ధతులు అసురక్షితానికి దారితీస్తాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
1971 చట్టం పెళ్లైన మహిళలకు సంబంధించిందన్నారు. అయితే 2021 చట్ట సవరణ ప్రకారం పెళ్లైన, పెళ్లికాని మహిళల మధ్య తేడా లేదన్నారు. చట్టబద్దమైన గర్భస్రావానికి మహిళలంతా అర్హులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహిత, అవివాహిత మహిళ మధ్య కృత్రిమ వ్యత్యాసాన్ని కొనసాగించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. మహిళలు స్వేచ్ఛగా గర్భస్రావం చేసుకొనేందుకు స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.