దిగ్గజ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ కొన్ని కంపెనీలు ఏదో సాకు చెప్పి ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు పలు రకాల సాకులు చెప్పి ఉద్యోగులను బయటకు గెంటివేసింది. మూన్ లైటింగ్ అని, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారని, ఆర్థిక మాంద్యం ఇలా రకరకాల కారణాలు చెప్పి చాలా మంది ఉద్యోగులను తీసేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి సేల్స్ ఫోర్స్ కంపెనీ చేరిపోయింది. పేరులో ఉన్న ఫోర్స్ కి తగ్గట్టే అంతే ఫోర్స్ గా వెయ్యి మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. పని తీరు బాలేదన్న కారణంతో వారిని తొలగిస్తున్నట్లు కంపెనీ రిపోర్టులో వెల్లడించింది. వేలాది మంది ఉద్యోగులను కంపెనీ 30 రోజుల రివ్యూలో పెట్టినట్టు తెలుస్తోంది.
పని తీరు బాగోలేకపోతే వారు నెల రోజుల తర్వాత ఉద్యోగం విడిచిపెట్టి వెళ్లిపోవాలని కంపెనీ ధృవీకరించింది. తమ సేల్స్ ఫోర్స్ కంపెనీ పెర్ఫార్మెన్స్ ప్రక్రియలో భాగంగా కొంతమంది ఉద్యోగులు కంపెనీ నుంచివెళ్లిపోవాల్సి వస్తుందని అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ విషయంలో వారికీ పూర్తి మద్దతు ఇస్తామని కంపెనీ తెలిపింది. ఉద్యోగాల కోత వెయ్యి కంటే తక్కువ మందిపైనే ఉంటుందని సేల్స్ ఫోర్స్ చెబుతోంది. కానీ రిపోర్టులు మాత్రం వేల మంది ఉద్యోగులపై వేటు ఉంటుందని చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నాటికి సేల్స్ ఫోర్స్ కంపెనీలో 73,541 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
అయితే కస్టమర్ల నుంచి సర్వీసులకు డిమాండ్ అత్యధికంగా ఉండడంతో.. కస్టమర్ సర్వీస్ కోసం గత ఏడాది ఉద్యోగుల సంఖ్యను 36 శాతానికి పెంచుకున్నట్లు ఆగస్టు నెలలో రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. అయితే ఇప్పుడు పని తీరు బాలేని కారణంగా వెయ్యి మంది దాకా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు కూడా సుమారు 90 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. 2023 జనవరి వరకూ నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ స్టార్ బోర్డు నుంచి ఒత్తిడి పెరిగిందని సేల్స్ ఫోర్స్ కంపెనీ తెలిపింది. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో తమ కంపెనీకి ప్రధాన పోటీ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కూడా ఈ ఏడాది అక్టోబర్ లో ఉద్యోగాల కోతను ప్రకటించిందని సేల్స్ ఫోర్స్ కంపెనీ వెల్లడించింది.