వినాయక చవితి పండగ వచ్చిందంటే గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి జై జై గణేశ అంటూ నినాదాలు చేస్తారు. వినాయక నిమజ్జన సమయం వచ్చిందంటే బై బై గణేశ అంటూ నినాదాలు చేస్తూ ఊరేగిస్తారు. ప్రతీ ఏటా, ప్రతీ చోటా ఇలానే జరుగుతోంది. వినాయకుడ్ని ఇంట్లోనో, వీధిలో ఏర్పాటుచేసిన మండపంలో తెచ్చి పెట్టుకోవడం, ఆ తర్వాత గంగలో నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. మండపంలో గణపతిని పెట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో.. నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటారు. అయితే గణపతి విగ్రహంతో ఒక రకమైన బంధం ఏర్పరచుకున్న చిన్నారులకి గణపతిని సాగనంపడం అంటే ఇష్టముండదు.
దేశవ్యాప్తంగా గణపతి నిమజ్జనోత్సవాలు జరుగుతున్న క్రమంలో చిన్నా, పెద్ద, ముసలి, ముతక అందరూ సంతోషంగా గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు. అయితే ఒక చిన్నారి మాత్రం నా గణపతిని తీసుకెళ్ళకండి అంటూ ఏడుస్తోంది. గణపతిని గట్టిగా కౌగలించుకుని.. గణేషుడ్ని తీసుకెళ్ళద్దంటూ మారాం చేసింది. పాప వయసు రెండేళ్లు అంతకంటే తక్కువ ఉంటుందేమో.. పాపం గణపతి విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇంటికి చుట్టాలు వస్తే పిల్లలు ఏడవడం మామూలే. అలాంటిది గణపతి కూడా చుట్టంలా కొన్ని రోజులు కనిపించేసరికి ఆ చిట్టి తల్లి వదిలిపెట్టలేకపోయింది. మొత్తానికి పాప తల్లి.. పాపని సముదాయించి.. ఎత్తుకుని గణపతి నుండి దూరం పెట్టడంతో గణపతి నిమజ్జనం విజయవంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ చిట్టి తల్లి గణపతిపై చూపిన ప్రేమ, భక్తికి నెటిజన్లు ఎట్రాక్ట్ అవుతున్నారు. మరి గణపతిని తీసుకెళ్ళద్దని మారాం చేసిన చిట్టి తల్లిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
मेरे बप्पा को मत ले जाओ pic.twitter.com/kTBPinmvzo
— Rameshwar Sharma (@rameshwar4111) September 9, 2022