ప్రస్తుతం సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత.. సెలబ్రిటీలకు చెందిన చిన్నప్పటి ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఆ పిక్స్ చూసి అసలు వీళ్లు వాళ్లేనా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది ఏ సినిమా సెలబ్రిటీనో, క్రికెట్ సెలబ్రిటీనో కాదు.. రియల్ లైఫ్ స్టార్ గురించి ప్రస్తావించబోతున్నాం. పైన ఉన్న ఫొటోలోని వ్యక్తి ప్రస్తుతం ఓ పెద్ద స్టేట్కి ముఖ్యమంత్రి. సాదా సీదా సీఎం కూడా కాదు.. ఆయన చాలా పవర్ ఫుల్ సీఎం. ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అస్సలు సహించడు.
సాధారణంగా సినిమా తారలు, క్రీడాకారులకు అభిమానులు ఉంటారు. రాజకీయ నాయకులు అనగానే కొందరు భయంతో, ఇంకొందరు అవసరాల కోసం వెనక తిరుగుతూ ఉంటారు. కానీ, ఈ సీఎంకి మాత్రం సినిమా తారల కంటే మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సమస్యలు వచ్చినప్పుడు స్పందించే తీరు, మహిళల రక్షణ విషయంలో తీసుకునే కఠిన చర్యలు ఇలా ఆయనకు చాలా మందే అభిమానులు ఉన్నారు. ఇంకొక హింట్ ఏంటంటే.. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు.
ఇంకా గుర్తుపట్టలేదా? ఆయన మరెవరో కాదు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇప్పటి వరకు అందరూ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలన గురించి చెప్పి ఉంటారు, ఆయన నిర్ణయాల గురించి చెప్పి ఉంటారు. ఇప్పుడు ఆయన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత వివరాల గురించి తెలుసుకుందాం. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్. ఆయన 1972 జూన్ 5న ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉన్న పౌరీ గర్వాల్ జిల్లా, పాంచుర్ లో జన్మించారు. వారిది రాజ్ పుత్ కుటుంబం. చదువుల్లో కూడా ఆయన దిట్టనే చెప్పాలి.
ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్ హెచ్ఎన్ బీ గర్ వాల్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పట్టా పొందారు. బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాసైన ఆయన.. గణితం, భౌతిక శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తర్వాత తర్వాత సన్యాసం వైపు ఆకర్షితులయ్యి కాషాయం ధరించారు. గోరఖ్ నాథ్ మఠాధిపతి ఆదిత్యానాథ్ అస్తమయం తర్వాత ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు. రోజూ కటిక నేలపైనే నిద్రిస్తారు. చలి, వాన, ఎండ ఏ రుతువులో నైనా ఒకటే తరహా వస్త్రాలు ధరిస్తారు. ఉదయాన్నే గేసేవ, గోపూజ చేస్తారు. సన్యాసం స్వీకరించిన కరాణంగా ఆయన తండ్రి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయారు.
ఆయన సోదరుడు భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. సోదరి- బావగారు చాయ్ దుకాణం నడిపిస్తుంటారు. 1998లో గోరఖ్ పూర్ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పుడు పార్లమెంట్ లో ఆయనే అతి పిన్న వయస్కుడు. 2017లో తొలిసారి సీఎం అయిన ఆయన.. 2022 మార్చిలో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో ప్రధాని అయ్యే అర్హతలు, అవ్వగల సత్తా ఉన్న నాయకుడు యోగి ఆదిత్యనాథ్ అంటూ అభిమానులు మాత్రమే కాదు.. కాషాయ వర్గాలు కూడా చెబుతుంటాయి.