అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో సమావేశమయ్యారు. కరోనా ప్రభావంతో గత కొంత కాలంగా ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ప్రయాణాలు చేయలేదు. ప్రస్తుతం ప్రధాని మోదీ అమెరికా టూర్ పై సర్వత్రా ఆసక్తి రేపుతుంది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి సమయంలో సహకరించిన అమెరికాకు ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా అధ్యక్షురాలిగా కమలాహారిస్ గెలవడం చారిత్రాత్మకమని.. ప్రపంచానికి కమలా హారిస్ ఒక స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. కాగా, కమలా హారిస్ తో భేటీ సందర్భంగా మోదీ ఓ అరుదైన కానుకను ఆమెకు అందజేశారు. అది ఓ చెక్క కళాఖండం. అయితే ఆ కళాకృతిని అందుకున్న కమలా హారిస్ తెగ మురిసి పోయారు. దానికి కారణం చెక్క జ్ఞాపికను రూపొందించింది కమలా హారిస్ తాత పీవీ గోపాలన్. పీవీ గోపాల్ హస్తకళల నిపుణుడు. తన తాతయ్య చేసిన అపురూప కళాఖండాన్ని తనకు కానుకగా ఇవ్వడం పట్ల కమలా హారిస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక వారణాసిలో తయారైన మీనాకారీ చదరంగం బోర్డును కూడా కమలా హారిస్ కు అందించారు. దానితో పాటుగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కు వెండితో రూపొందించిన మీనాకారీ నౌక బొమ్మను బహూకరించగా, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపుచెక్కతో రూపొందించిన బుద్ధ ప్రతిమను కానుకగా ఇచ్చారు. ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన జీవితంలో ఎన్నడూ మరువలేని విధంగా అపురూపమైన కానుకలు ఇవ్వడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.