పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియా దేశంలో విషాదం చోటు చేసుకుంది. చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో 11 మంది చిన్నారులతో పాటు ఓ గర్భిణీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియా దేశ రాజధాని శివార్లలోని పొరుగున ఉన్న న్యూ క్రూ టౌన్లో రాత్రి జరిగిన క్రిస్టియన్ ఆరాధన కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగిందని లైబీరియా డిప్యూటీ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి జలవా టోన్పో చెప్పారు.
ఇది చదవండి : ఇదెక్కడి చోద్యం.. ఏకంగా గ్రామాన్నే కుదవ పెట్టారు కదా
మొన్వోరియా శివారులోని న్యూ క్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చి వద్ద బుధవారం రాత్రి ఓ వేడుక నిర్వహించారు. ఆ వేడుకలోకి ఓ దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఒక్కసారిగా దోపిడి దొంగలు రెచ్చిపోవడం.. భయంతో జనాలు పరుగులు తీశారు.. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. కొందరు కిందపడిపోగా.. వారిని తొక్కుకుంటూ పలువురు పరుగులు తీశారు. దాంతో 29 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు కారణమేమిటనే దానిపై వ్యాఖ్యానించేందుకు లైబీరియా దేశ పోలీసు ప్రతినిధి మోసెస్ కార్టర్ నిరాకరించారు. కేసు విచారణ కొనసాగుతుందని వివరించారు.