బ్రిటన్.. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగి.. ప్రపంచ దేశాలన్నింటిని పాలించింది.. శాసించింది. ఇక భారతదేశాన్ని సుమారు 200 ఏళ్ల పాటు పాలించింది. ఒకప్పుడు భారతీయులు అంటేనే చాలా చిన్నచూపు, చులకన భావం కలిగిన దేశానికి నేడు.. అదే భారతీయ మూలాలున్న ఓ హిందూ వ్యక్తి ప్రధానిగా ఎన్నికవ్వడం ఎంతటి విచిత్రమో కదా. దీపావళి పండుగ రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రిషి సునాక్ ప్రస్థానం గురించి తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు తెగ ఆరాటపడుతున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి స్థాయి నుంచి నేడు బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహించే స్థాయికి ఎదిగాడు రిషి సునాక్.
ఆయనకు భారతీయ మూలాలు ఉండటం మాత్రమే కాక.. స్వయంగా భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి అల్లుడు కూడా. నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తిని వివాహం చేసుకున్నాడు రిషి సునాక్. ఈ క్రమంలో రిషి సునాక్కు సంబంధించిన విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి.
రిషి సునాక్ పూర్వీకులు భారతదేశానికి చెందినవారు. అతడి పూర్వీకులు పంజాబ్ నుంచి తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు ఉన్న తర్వాత.. ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ కెన్యాలో జన్మించగా.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. రిషి సునాక్ తల్లిదండ్రుల కుటుంబాలు బ్రిటన్కు వలస వెళ్లిన తర్వాత అక్కడ వారి వివాహం జరిగింది. ఆ తర్వాత 1980, మే 12న సౌథాంప్టన్లో రిషి సునాక్ జన్మించారు.
బ్రిటన్లో జన్మించిన.. రిషి సునాక్ ఆ తర్వాత ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు.. పలు సంస్థల్లో ఉద్యోగం చేశారు. ఎంబీఏ కోర్సులో చేరడానికి ముందు ఆయన వెయిటర్గా కూడా పని చేశారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ వైద్యుడు కాగా.. తల్లి ఉష మెడికల్ షాప్ నిర్వహించేవారు. తల్లిదండ్రులిద్దరూ వైద్య రంగంలో పని చేస్తున్నప్పటికి.. రిషి సునాక్ మాత్రం ఆర్థిక రంగాన్ని కెరీర్గా ఎంచుకున్నారు. ఆయన ఆక్స్ఫర్డ్లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ చదివారు. ఆ తర్వాత గోల్డ్మ్యాన్ సచ్కు ఆర్థిక రంగంలో పనిచేశారు. కొంత కాలం సిలికాన్ వ్యాలీలోనూ పనిచేశారు.
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ భారతీయ కుటుంబానికి అల్లుడు కావడం విశేషం. మన దేశంలో ప్రముఖ టెక్ కంపెనీ.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు. రిషి సునాక్ కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో నారాయణమూర్తి కుమార్తె అక్షతతో తనకి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత.. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అక్షత తమ ప్రేమ గురించి తండ్రి నారాయణమూర్తికి చెప్పినప్పుడు.. ఆయన మొదట రిషి సునాక్ పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అక్షత మాత్రం.. రిషి సునాక్తో ఒకసారి మాట్లాడి చూడాలని ఆమె తండ్రి నారాయణమూర్తిని కోరింది. కుమార్తె కోరిక మేరకు రిషి సునాక్తో మాట్లాడిన తర్వాత నారాయణమూర్తి తన ఆలోచనను మార్చుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్షతకు రాసిన లేఖలో ఇలా చెప్పారట.. ‘నేను రుషిని కలిశాను. నువ్వు తన గురించి నాకు చెప్పిందంతా నిజమే. రిషి బ్రిలియంట్ పర్సన్. అందగాడు, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అన్నింటికంటే మించి అతడి నిజాయితీ నాకు బాగా నచ్చింది’ అని రాశారట. ఈ విషయాన్ని ‘లెగసీ: లెటర్స్ ఫ్రమ్ ఎమినెంట్ పేరెంట్స్ టు దేర్ డాటర్స్’ అనే పుస్తకంలో నారాయణ మూర్తి వెల్లడించారు.
కొన్నాళ్ల క్రితం ప్రకటించిన నివేదికల ప్రకారం.. బ్రిటన్లో టాప్ 250 బిలియనీర్లలో రిషి సునాక్ 222వ స్థానంలో నిలిచారు. ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన భార్య అక్షత 243వ స్థానంలో నిలిచారు. 2022 నాటికి భార్యాభర్తలిద్దరి సంపాదన కలిపి 730 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ క్రమంలో సునాక్ దంపతులు ఆస్తి విలువ.. క్వీన్ ఎలిజిబెత్ -II ఆస్తి కంటే ఎక్కువేనని కొన్ని ఆంగ్ల మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఈ క్రమంలో రిషి సునాక్.. బ్రిటన్లో అత్యంత ధనవంతుడైన ఎంపీగా గుర్తింపు పొందారు. అంతేకాక.. బ్రిటన్లో అత్యున్నత పదవి చేపట్టిన 42 ఏళ్ల పిన్న వయస్కుడిగా మరో రికార్డు నెలకొల్పారు రిషి సునాక్.
రిషి సునాక్ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి సునాక్.. మాజీ ప్రధాని బోరిస్కు మద్దతిచ్చారు. బోరిస్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. బోరిస్ జాన్సన్కు అత్యంత నమ్మకస్థుడని రిషికి పేరుంది. తనదైన వ్యక్తిత్వం, దూకుడుతో అనతికాలంలోనే ‘రైజింగ్ స్టార్’ మినిస్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు రిషి సునాక్.
సునాక్ పనితీరు మెచ్చి 2020 ఫిబ్రవరిలో ఆయనకు ఛాన్సలర్గా పదోన్నతి కల్పించారు. అంతేకాక కేబినెట్లో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా హోదా కల్పించారు. దాంతో ఆయన కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునాక్ అద్భుతమైన పని తీరు కనబరిచారు. అప్పుడే ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించారు. అలానే బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ వైదొలగాలని రిషి సునాక్ సూచన కూడా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 2020 మార్చిలో సునాక్ పార్లమెంట్లో తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. హిందువునని గర్వంగా చెప్పుకునే సునాక్.. పార్లమెంట్లో ఎంపీగా పదవీ చేపట్టేముందు.. భగవద్గీతపై ప్రమాణం చేశారు. సామాన్యుడిగా మొదలైన రిషి సునాక్.. తన తెలివితేటలు, కృషి, పట్టుదలతో బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం.. మాత్రమే కాక ఆదర్శంగా నిలిచింది.