సినిమా నటులను చూడటానికి వారి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహపడుతుంటారు. తమకిష్టమైన హీరో,హీరోయిన్ను దూరంనుంచి ఒక్కసారి చూసినా చాలని భావిస్తుంటారు. కొంతమంది పిచ్చి అభిమానంతో వారిని కలవాలని, ఫొటో దిగాలని భావిస్తుంటారు. ఎంతో కష్టపడి వారు అనుకున్నది చేస్తుంటారు. మరికొంత మంది తాము అనుకున్నది చేసే ప్రయత్నంలో తమ అభిమాన నటులను ఇబ్బంది పెట్టడంతో పాటు వాళ్లు కూడా ఇబ్బందుల్లో పడుతుంటారు. తాజాగా, ఓ మహిళ తన అభిమాన హీరో సాయి ధరమ్ తేజ్ను కలిసేందుకు ఏకంగా ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే, కాపలా సిబ్బంది ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
తమినాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన జోష్ కమలకు సాయి ధరమ్ తేజ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి ఆమె తన అభిమాన హీరోను కలవాలని అనుకుంటోంది. ఇందుకోసం కష్టపడి హైదరాబాద్కు వచ్చింది. రావటమే కాదు.. సాయి ధరమ్ తేజ్ ఇళ్లు ఎక్కడుందో కూడా తెలుసుకుంది. నేరుగా సాయి తేజ్ ఇంటికి వెళ్లింది. తర్వాత ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అది గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డగించారు. కమలను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. సాయి ధరమ్ తేజ్ను కలవటానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. కమలకు మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.