అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. కిరాతకుడిగా మారిన భర్త కట్టుకున్న భార్యను కడతేర్చి కాలువలో పడేశాడు. పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీడమర్రు గ్రామానికి చెందిన చెన్నం వీరన్న, రమ్య (26) భార్యాభర్తలు. వీరికి పెళ్ళై ఆరేళ్లు అవుతుంది. ఇద్దరు పిల్లల సంతానం. భర్త డ్రైవర్ గా పని చేస్తుండగా.. భార్య కూలీ పనులకు వెళ్తుండేది. ఇలా కొంత కాలం పాటు వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ ఉండేది.
అయితే రోజులు మారే కొద్ది భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంతోనే భార్యను రోజూ వేధింపులకు గురి చేసేవాడు. నన్ను కాదని నువ్వు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని తరుచు గొడవలు చేసేవాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య వివాదం జరిగేది. అయితే గత నెల 31న కూడా భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. మాటా మాటా పెరగడంతో గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇక కోపంతో ఊగిపోయిన భర్త భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని వ్యాన్ లో తీసుకుని గ్రామ శివారు ఉన్న పందికొండ కాలువలో పడేశాడు. ఆ తర్వాత నా భార్య కనిపించడం లేదంటూ బంధువులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే రమ్య తల్లి అల్లుడిపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును కూడా స్వీకరించిన పోలీసులు వీరన్నను విచారించారు. మొదట్లో నాకేం తెలియదు అన్నట్లుగా సమాధానాలు చెప్పిన భర్త.., పోలీసులు గట్టిగా విచారించేసరికి అసలు నిజాన్ని వెళ్లగక్కాడు. నా భార్యను నేనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టుకు తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్తే అనుమానంతో భార్యను హత్య చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.