విశాఖలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలతకు సంబంధించి ట్విస్టులు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఆమెకు సినిమాలంటే పిచ్చి ఇష్టమని.. అందుకోసం ఆమె శిక్షణ కూడా పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె హీరోయిన్ గా ఒక సినిమాలో కూడా నటించేందుకు ఒప్పుకున్నారు. కానీ ఇంతలోనే కేసులో ఇరుక్కున్నారు.
విశాఖపట్నంలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో సీఐ స్వర్ణలత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సినిమాని మించిన ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఈమెకు సినిమాలంటే పిచ్చి. ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తున్నారు. అంతేకాదు సినిమా బాధ్యతలను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వర్ణలత హీరోయిన్ గా చేస్తున్న సినిమా పేరు ‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్’. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఈ సినిమాలో ఆమె పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారు. ఈమెకు సినిమాల్లో నటించాలన్న కోరిక బలంగా ఉందట. డ్యాన్సులు నేర్చుకుంటే సినిమాలో అవకాశం ఇస్తానని ఎవరో చెప్పడంతో ఆమె ఒక కొరియోగ్రాఫర్ ని పెట్టుకుని మరీ డ్యాన్స్ నేర్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె రెండు పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గాజువాకకు చెందిన రిటైర్డ్ నేవీ ఉద్యోగులైన కొల్లి శ్రీను, శ్రీధర్ లకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి.సూరిబాబు ఒక డీల్ గురించి మాట్లాడాడు. రూ. 90 లక్షల విలువ చేసే రూ. 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల విలువ చేసే రూ. 2 వేల నోట్లు ఇస్తామని, దీంతో మీకు రూ. 10 లక్షలు మిగులుతాయంటూ ఆశ చూపించాడు. ఈ డీల్ చేస్తే రూ. 10 లక్షలు మిగులుతాయని కొల్లి శ్రీను, శ్రీధర్ లు అందుకు అంగీకరించారు. దీంతో ఇద్దరూ డబ్బు తీసుకుని సీతమ్మధారలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన సూరిబాబు వారి దగ్గర డబ్బులు చూసి సీఐ స్వర్ణలతకు ఫోన్ చేశాడు. కాసేపటికి పోలీస్ జీపులో సీఐ స్వర్ణలత, డ్రైవర్ కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డు శ్రీను అక్కడకు వచ్చారు. సూరిబాబు దగ్గరకు వెళ్లి కాసేపు హడావుడి చేశారు. ఇంత డబ్బు ఎక్కడిది అంటూ భయపెట్టారు. అరెస్ట్ చేస్తామంటూ హడావుడి చేసి భయపెట్టారు. దీంతో రిటైర్డ్ నేవీ ఉద్యోగులు భయపడ్డారు. కేసు లేకుండా చేయాలంటే రూ. 12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ నేవీ ఉద్యోగులు సీఐ స్వర్ణలతకు రూ. 12 లక్షలు ఇచ్చేసి వెళ్లిపోయారు. అయితే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేసి సీఐ స్వర్ణలతతో పాటు ఇందులో ప్రమేయం ఉన్న వారిని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా స్వర్ణలతపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఏఆర్ హోంగార్డు ఎస్సైగా పని చేస్తున్నప్పుడే హోంగార్డు నియామకాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత విజయవాడ బదిలీ అయ్యారు. అక్కడ కొన్ని రోజులు పని చేసి శ్రీకాకుళం వెళ్లారు. జిల్లాల విభజన తర్వాత అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. విశాఖలో ఖాళీ ఉండడంతో అక్కడకు వెళ్లారు. కొంతకాలం సిటీ ట్రైనింగ్ సెంటర్ లో పని చేసి హోంగార్డు ఆర్ఐగా బాధ్యతలు చేపట్టారు.