తమ ప్రేమను అంగీకరించడంలేదని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ఈ దారుణంలో తల్లి కూడా పాలుపంచుకుంది. భర్త అని చూడకుండా భార్యా.. తండ్రి అని చూడకుండా కూతురు.. ప్రియుడితో కలిసి అతడిని హత్య చేశారు. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో వారు కటకటలపాలైయ్యారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. దృశ్యం సినిమాను పది సార్లు చూసి ఈ హత్యకు ప్లాన్ వేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఎస్పీ సంజీవ్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. సుధీర్ కాంబళే (57) బెళగావి ప్రాంతానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడికి భార్య రోహిణి, కుతురు స్నేహ ఉన్నారు. ఇక సుధీర్ గతంలో దుబాయ్ లో పనిచేశాడు. కరోనా కారణంగా ఇండియాకు తిరిగి వచ్చి ఇక్కడే తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే వ్యాపారంలో వచ్చిన డబ్బును కూతురు, భార్యకు ఇచ్చేవాడు కాదు. దాంతో భార్య అతడిపై కోపాన్ని పెంచుకుంది. ఈ క్రమంలోనే కుతురు స్నేహ.. అక్షయ్ విఠకర్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో, వారి ప్రేమకు అతడు ఒప్పుకోలేదు. దాంతో కూతురు సైతం తండ్రిపై పగ పెంచుకుంది. ఇద్దరూ కలిసి తండ్రిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేశారు.
ప్లాన్ ప్రకారంమే సెప్టెంబర్ 17 అక్షయ్ ను తమ ఇంటికి పిలిపించారు. సుధీర్ నిద్రిస్తుండగా అతడి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు తల్లీ కూతురు. ఇక ప్రియుడు అక్షయ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సుధీర్ ను విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో అతడు మరణించాడు. అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు అక్షయ్ పూణే కు వెళ్లిపోయాడు. రోహిణి తన భర్తను ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తల్లీ కూతుళ్ల మీద అనుమానం రావడంతో.. వారివైపు నుంచి తీగ లాగగా డొంక మెుత్తం కదిలింది. విచారణలో ఇద్దరూ ఒకే రీతిలో సమాధానం చెప్పడంతో.. పోలీసులు వారి ఫొన్ కాల్ రికార్డులను పరిశీలించారు. దాంట్లో అక్షయ్ తో పలు దఫాలుగా మాట్లాడినట్లు తేలింది. చివరికి వారు తమ తప్పును అంగీకరించారు. పైగా ఈ హత్య చేయడానికి దృశ్యం సినిమాను 10 సార్లు చూసినట్లు విచారణలో చెప్పడం గమనార్హం.