ఆడపిల్లని.. తల్లిదండ్రులు ఆమెను భారంగా భావించలేదు. మహాలక్ష్మి జన్మించిందని ఎంతో సంతోషించారు. తమకున్నంతలో కూతుర్ని అల్లారుముద్దుగా చూసుకున్నారు. బాగా చదివించారు. కుమార్తె జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశించారు. తల్లిదండ్రుల కోరికకు తగ్గట్టుగానే.. ఆమె చదువుకుంది.. మంచి ఉద్యోగం సంపాదించింది. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సాధించి.. తల్లిదండ్రులు గర్వపడేలా చేసింది. బిడ్డ విజయాన్ని చూసి వారు ఎంతో పొంగిపోయారు. మంచి చదువు, ఉద్యోగం.. ఇక మిగిలింది వివాహమే. దాంతో కుమార్తెకి సంబంధాలు చూడటం ప్రారంభించారు. బిడ్డకు తగ్గట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వెదికి.. అంగరంగా వైభవంగా వివాహం జరిపించారు. పిల్లాపాపలతో కుమార్తె నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. ఇక ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి ప్రవేశించిన ఆమెకు ఏడాదిలోనే అనుకోని షాక్ తగిలింది. భర్త చేసిన మోసం తట్టుకోలేక.. ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన వివరాలు..
ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరు నగరం రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్లో ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక బాధితురాలి పేరు శ్వేత.. ఐబీఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. శ్వేతకు 11 నెలల క్రితం అభిషేక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతడు టీసీఎస్ కంపెనీలో ఐటీ ఇంజనీర్. ఇక కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శ్వేతకు ఏడాది కూడా గడవక ముందే దారణ పరిస్థితులు ఎదురయ్యాయి. నమ్మి వివాహం చేసుకున్న వ్యక్తి శ్వేతను దారుణంగా మోసం చేశాడు.
శ్వేత భర్త అభిషేక్కు పెళ్లికి ముందే ఓ యువతితో సంబంధం ఉంది. ఆ విషయాన్ని దాచి వివాహం చేసుకోవడమే కాక.. పెళ్లి తర్వాత కూడా ఆ అనైతిక బంధాన్ని కొనసాగించాడు. ఈ విషయం కాస్త శ్వేతకు తెలియడంతో.. దంపతుల మధ్య తరచు గొడవలు జరిగేవి. పెద్దలకు తెలియడం.. వారు పంచాయతీ పెట్టడం.. రాజీ చేయడం కూడా జరిగింది. ఈ సంఘటనల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు బుద్ధిగా ఉన్న అభిషేక్.. తర్వాత పాత బంధాన్ని కొనసాగించాడు. ఎన్ని సార్లు చెప్పినా అభిషేక్లో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో మోసపోయానని విరక్తి చెందిన శ్వేత.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకంది.
కన్నబిడ్డ మృతితో శ్వేత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తర్వాత అల్లుడి అక్రమ సంబంధం కారణంగానే తమ కుమార్తె మరణించిందని.. అభిషేక్తో పాటు అతడి తల్లిదండ్రుల మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.