బంగారం అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. బంగారాన్ని కేవలం అలంకారం కోసం మాత్రమే కాకుండా ప్రెస్టేజ్ సింబల్ గానూ భావిస్తుంటారు. ఇండియాలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రేమ. అలాగే ప్రస్తుతం బంగారాన్ని ఆభరణంగానే కాకుండా.. పెట్టుబడి మాధ్యమంగానూ చూస్తున్నారు. చాలా మంది డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడులు బాగా పెడుతున్నారు. అయితే ఇటీవల పండగ సీజన్ కావడంతో బంగారం ధలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బంగారం కొనుగోలు దారులకు ఇది శుభవార్తగానే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బంగారం ధర కాస్త దిగొచ్చింది. అయితే తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
కర్ణుడు మరణానికి శతకోటి కారణాలు అన్నట్లు.. బంగారం ధర తగ్గడానికి కూడా ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలు ఉన్నాయి. భారత్ లో బంగారం దిగుమతులు తగ్గాయి. గోల్డ్ బ్యాంకులు కూడా చైనా, టర్కీ, హాంకాంగ్ దేశాలకు ఎగుమతులు పెంచేశాయి. అంతర్జాతీయంగానూ పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి. చైనాని చూస్తే లాక్ డౌన్ కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. అమెరికాని చూస్తే.. అక్టోబర్ లో ద్రవ్యోల్భణం కాస్త తగ్గినా.. వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. అయితే ఇండియాలో బంగారం, వెండి ధరలు ఐదురోజుల తర్వాత కాస్త తగ్గుముఖం పట్టాయి.
ఇటీవలి కాలంలో తులంపై రూ.340 తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా తులం బంగారం ధర మరో రూ.100 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.100 తగ్గి.. రూ.52,880కి చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.48,460గా ఉంది. మరోవైపు వెండి ధరల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.68,100గా ఉంది. ఈ ధరలు మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనాలి అనుకునేవారు.. బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న వాళ్లు.. ఇంకా కొన్నాళ్లు ఎదురుచూస్తే మంచిదని సూచిస్తున్నారు.