వ్యవసాయం అంటే దండగ అని అనుకునే రోజులు. వ్యవసాయం ఎవరు చేస్తారెహే అని వదిలేసి వలస కూలీలుగా వెళ్తున్న రోజులివి. ఇలాంటి సమాజంలో కూడా లక్షల ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయంలో అడుగుపెట్టి లక్షలు సంపాదిస్తున్నారు కొందరు. చేసే పనికి విజ్ఞానం తోడైతే ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చునని ఇప్పటికే చాలా మంది యువకులు నిరూపించారు. తాజాగా ఒక రైతు ఏకంగా మట్టి లేకుండా, ఎకరాలు ఎకరాలు భూమి అవసరం లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. సిటీల్లో వ్యవసాయం చేయాలంటే నేల దొరకడమే గగనం. అలాంటిది తక్కువ స్థలంలో మట్టి కాన్సెప్ట్ లేకుండా వ్యవసాయం ఎలా సాధ్యం? అనే కదా మీరు అనుకుంటున్నారు.
అది ఎలా సాధ్యం అంటే.. హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అనే ఆధునిక పద్ధతి ఉంది. ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తే పంట పండుతుంది, లాభాల పంటా పండుతుంది. మట్టితో పని లేకుండా వ్యవసాయం చేయడాన్ని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటారు. మట్టి నుంచి మొక్కకు దొరికే పోషకాలను నీటి ద్వారా అందించడమే హైడ్రోపోనిక్ ఫార్మింగ్ విధానం. ప్రస్తుతం హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఈ విధానాన్ని అనుసరించే లాభాల పంట పండిస్తున్నారు. ఈ విధానంలో అన్ని రకాల పంటలను పండించవచ్చునని ఆయన అంటున్నారు. ఈ హైడ్రోపోనిక్ వ్యవసాయాన్ని 2010లో జపాన్ లో చూసిన సత్యనారాయణ.. ఇండియా వచ్చి ఇదే పద్ధతిలో సాగు చేస్తే ఎలా ఉంటుందా అని ప్రయత్నించారు.
ముందు ఆయన ఇంటి బాల్కనీలో చిన్నగా సాగు ప్రారంభించారు. సరైన అవగాహన లేక మొదట్లో ఫెయిలయ్యారు. ఆ తర్వాత లోతుగా రీసెర్చ్ చేసి.. అవగాహన వచ్చిన తర్వాత అంటే 2019లో ఇన్ఫినిటీ ఫార్మింగ్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. అది విజయవంతమవ్వడంతో ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వివిధ సూపర్ మార్కెట్లకు పంట ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. మొక్క పెరగడానికి మట్టి బదులు కొబ్బరి పీచుని ఉపయోగిస్తున్నారు. ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ కి ఎకరాల ఎకరాల భూమి అవసరం లేదు. ఇంటి టెర్రస్ పైన గానీ బాల్కనీలో కొంచెం స్థలం ఉన్నా సాగు చేయవచ్చు. హైడ్రోపోనిక్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని.. అందులో నచ్చిన పంటను వేసుకోవచ్చు.
ఆకుకూరలు, బ్రకోలి లాంటి పంటలను వేసుకుంటే గిట్టుబాటు ధర ఉంటుందని సత్యనారాయణ అంటున్నారు. ఈ విధానంలో వ్యవసాయం చేయాలనుకుంటే స్థలాన్ని బట్టి పెట్టుబడి మారుతూ ఉంటుంది. స్థలం పెరిగేకొద్దీ దీనికి అయ్యే పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. ఉదాహరణకి 2వేల గజాల స్థలంలో హైడ్రోపోనిక్ వ్యవసాయం చేయాలనుకుంటే.. పాలీహౌస్, ఇతర ఖర్చులు మొత్తం కలిపి దాదాపు రూ. 16 లక్షలు అవుతుంది. ఇది ఒకసారి మాత్రమే పెట్టే పెట్టుబడి. మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో ప్రస్తుతం మార్కెట్ లో గిట్టుబాటు ఉన్న పంటలు పండిస్తే నెలకు రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ సంపాదించవచ్చునని సత్యనారాయణ చెబుతున్నారు.