డబ్బే పరమావధిగా బతుకుతున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో ఏ ఒక్క రూపాయి మనకు కలిసొస్తుందన్నా తప్పక తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పబోయేది అలాంటి వార్తే. ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉన్నా ప్రతి ఒక్కరి పేరుపైనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉండి ఉంటుంది. కాకుంటే ఇది వారు ఉపయోగించే కార్డు రకాన్ని బట్టి వర్తిస్తుంది. కనిష్టంగా రూ.2 లక్షలు మొదలుకొని గరిష్టంగా రూ. 20 లక్షల వరకూ ఈ భీమా వర్తిస్తుంది. అయితే ఇందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవేంటన్నది ఇప్పుడు చూద్దాం..
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఏటీఎం కార్డు తప్పక ఉంటుంది. దీన్ని ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేయడానికి, షాపింగ్ చేయడానికి ఎక్కువుగా ఉపయోగిస్తుంటాం. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే.. డెబిట్ కార్డుతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా పొందవచ్చు. ఈ సదుపాయాన్ని దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ కల్పిస్తోంది. ఈ భీమా అనేది ఏటీఎం కార్డు రకాన్ని బట్టి ఉంటుంది. ప్రమాదంలో మరణించిన వారికి ఈ మొత్తం ఇస్తారు. అంటే.. ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారనమాట.
అధికారిక ఎస్బీఐ వెబ్సైట్లోని వివరాల ప్రకారం.. ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చే ఇన్సూరెన్స్. ఏటీఎం కార్డును బట్టి బీమా మొత్తం మారుతుంది. గరిష్ఠంగా 20 లక్షల వరకూ లభిస్తుంది. అయితే.. యాక్సిడెంట్ జరిగిన నాటికి తొంభై రోజుల వ్యవధిలో కనీసం ఒకసారైనా ఏటీఎం కార్డు వినియోగించిన వారికి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అలాగే.. విమాన ప్రయాణంలో మరణిస్తే, ప్రమాదం జరిగిన నాటికి తొంభై రోజుల వ్యవధిలో కనీసం ఒకసారైనా ఏటీఎం కార్డు వినియోగించి ఉండాలి. మరియు ఆ విమాన ప్రయాణ టికెట్ ను సదరు ఏటీఎం కార్డును ఉపయోగించి కొనుగోలు చేసి ఉండాలి. పైన చెప్పబడిన నియమ నిబంధనలు వర్తిస్తే.. మరణించాక సంబంధిత బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించి బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారాన్ని అధికారిక ఎస్బీఐ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం అందిస్తున్నాం. మరిన్ని పూర్తి వివరాలకు బ్యాంకు సిబ్బందిని సంప్రదించండి.