ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్ నేడు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల నరసాపురంలో ఒకేసారి రూ.3,300 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని.. త్వరలో నరసాపురం రూపు రేఖలు మారిపోతాయని అన్నారు. నరసాపురంలో ఆక్వా వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు చేస్తున్నామని.. పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.
ఈ మూడు సంవత్సరాల 5 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎంతో కృషి చేశామని అన్నారు. రూ. 1,76,516 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి అవినీతి లేకుండా జమ చేశాం.. భవిష్యత్ లో మరింత చేయూత ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షనేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సందించారు. చంద్రబాబు తన 45ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చేయలేని విధంగా విద్యా, వైద్యం, ఇళ్లస్థలాలు, ఇళ్లనిర్మాణాలతో పాటు ఇతర రంగాల అభివృద్ది తమ ప్రభుత్వంలో చేసి చూపించామని అన్నారు. గత కొంత కాలంగా చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గెలవలేమన్న ప్రెస్టేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్.
ఇక చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు తమ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారని.. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా, జనసేన అంటే రౌడీ సేనగా మార్చేశారని విమర్శించారు. 1995లో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురైన యన్టీఆర్ ఇలాంటి మనిషికా తన ఇంట్లో, పార్టీలో స్థానం ఇచ్చాను అని బాధపడుతూ ఇదేం ఖర్మరా అనుకొని ఉంటాడు. ఇప్పుడు ఏపీ ప్రజలు చంద్రబాబు విషయంలో ఇదేం ఖర్మరా.. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉన్నాడని భావిస్తున్నారని అన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు ఆయన సొంతు పుత్రుడిని, దత్త పుత్రుడిని ఓడించి బై బై చెప్పారని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలవలేమన్న ఆవేదనలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే తాను రాజకీయాల్లో ఉండాలన్నా, మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలన్నా తనను గెలిపిస్తే సరేసరి.. లేదంటే ఇవే నా చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎప్పటికైనా అభివృద్దికే ఓటు వేస్తారు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వారినే గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. మీ ఇంట్లో అభివృద్ది జరిగిందా లేదా? అన్న విషయాన్ని కొలమానంగా చూసుకొని మంచి జరిగిందని భావిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయండి అని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.