తిరుమల తిరుపతిలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. ఇదే సమయంలో భక్తులు స్వామికి వారికి కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు భక్తులు స్వామి వారికి భారీ విరాళం అందిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఎన్నారై టీటీడీ కి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. అలాగే మరో ఇద్దరు భక్తులు స్వామివారి అన్న ప్రసాద ట్రస్టుకు విరాళం అందించారు. బెంగళూరుకు చెందిన భక్తులు రూ.30 లక్షల విలువ చేసే బంగారు చెవిదిద్దులు శ్రీవారి అందజేశారు.
అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుడు డేగా వినోద్ కుమార్, రాధికా రెడ్డి దంపతులు టీటీడీకి కోటీ రూపాయలు విరాళం అందజేశారు. టీటీడీ నిర్వహి స్తున్న స్విమ్స్ ఆస్పత్రి పథకాలకు కోసం ఈ భారీ విరాళాన్ని వినోద్ కుమార్ దంపతులు అందించారు. వినోద్కుమార్, రాధికారెడ్డి దంపతులు ఈ విరాళాన్ని తిరుమలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అలాగే తిరుపతికి చెందిన డాక్టర్ ఎం.ఎం. కుమార్, సుబ్రహ్మణ్యం రాజు అనే భక్తులు స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. విరాళం మొత్తాన్ని చెక్ రూపంలో ఈవో ధర్మారెడ్డికి అందించారు.
మరోవైపు బెంగళూరుకు చెందిన భక్తులు బంగారు చెవి దిద్దులు కానుకగా అందించారు. బెంగుళూరు కె.ఆర్ పురంకు చెందిన మునిరాజ అనే వ్యక్తి స్వామి వారికి చెవి దిద్దులు అందజేశారు. సుమారు 600గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ చెవి దిద్దుల విలువ రూ. 30లక్షలు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని.. ఈ కానుకను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందించారు. శ్రీవారికి భక్తులు కానుకలు చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో డబ్బులు, బంగారంతో పాటూ వాహనాలను కూడా స్వామివారికి విరాళంగా అందజేస్తుంటారు.