గత వారం రోజులుగా ఏపిలో వర్సిటీకి NTR పేరు మార్చడంపై పెద్ద ఎత్తున రగడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా లక్ష్మీపార్వతి యన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు విషయంపై స్పందించారు. యన్టీఆర్ పేరు మార్చే విషయంపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో అందరికీ స్పష్టంగా తెలియజేశారు. ఆయన యన్టీఆర్ ని ఎంతో గౌరవిస్తారు.. అభిమానిస్తారు. ఇక ఈ విషయంలో తన వైఖరి ఒక్కటే.. యన్టీఆర్ పేరు యూనివర్సిటీకి ఉండాలా? జిల్లాకు ఉండాలా? అంటే ఖచ్చితంగా జిల్లాకే ఆయన పేరు ఉండాలని కోరుకుంటానని అన్నారు లక్ష్మీ పార్వతి.
యూనివర్సిటీ పేరు మార్చే విషయంలో టీడీపీ రాజకీయం చేస్తుందని.. ఇప్పుడు తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తుందని వాపోయారు. తాను అధికారం కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదని.. ఏపీలో ఏ సంఘటన జరిగినా తన వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేస్తున్నారు. వైశ్రాయ్ హూటల్ వద్ద చెప్పులు వేయించిన సంగతి గుర్తులేదా అది ఎవరు చేయించారో ప్రతి ఒక్కరికీ తెలుసు.. పార్టీని కాజేసిన వ్యక్తికి యన్టీఆర్ కుమారులు మద్దతు పలికారు.
అధికారంలో ఉన్న సమయంలో ఏరోజైనా దేనికైనా యన్టీఆర్ పేరు పెట్టారా? ఇప్పుడు పేరు మార్చే విషయంలో యన్టీఆర్ హంతకులు హడావుడి చేస్తున్నారు. గతంలో తనపై టీడీపీ నేతలు లేనిపోని దుష్ప్రచారం చేసి తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని.. ఇప్పుడు జూ.యన్టీఆర్ ని టార్గెట్ చేసుకొని ఆయనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. యన్టీఆర్ స్వశక్తితో పైకి వచ్చాడు.. సీనియర్ యన్టీఆర్ పోలికలు అంతో ఇంతో ఉండటం అతనికి కలిసి వచ్చింది. ఇండస్ట్రీలో ఇప్పుడు తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న జూ.యన్టీఆర్ ని పతనం చేసేందుకు, ప్రజల్లో అతనికి చెడ్డ పేరు తెచ్చేందుకు టీడీపీ కొత్తరాజకీయ డ్రామాకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి.
ప్రజలు అంతా గమనిస్తున్నారు.. ఏది నిజం ఏది అబద్ధం అనేది వారికి తెలుసు. జిల్లాకు యన్టీఆర్ పేరు పెట్టడం పట్ల సీఎం జగన్ కి ఆయనపై ఎంత అలభిమానం ఉందో తెలిసిపోతుంది. గతంలో యన్టీఆర్ కు భారతరత్న ఇవ్వొద్దని చంద్రబాబు స్వయంగా వాజ్ పేయికి చెప్పారు. ఒకరకంగా యన్టీఆర్ కి భారతరత్న రాకుండా అడ్డుకుంది చంద్రబాబే అని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.