ఒక పక్క పేదరికం.. మరోపక్క చదవాలన్న జిజ్ఞాస. అదే ఆమెను పీహెచ్డీ పట్టాదారునిగా చేసింది. సాధారణ కూలీగా ఉన్న భారతి.. డాక్టర్ భారతిగా మారారు. ఇది పూర్తిగా ఆమె కష్టమే. అయితే సుమన్ టీవీ కథనాలకు వచ్చిన స్పందనతో భారతి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఉద్యోగం వచ్చింది.
‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు’అన్న మాటకు అక్షర సత్యం సాకే భారతి. కడు పేదరికంలో పుట్టి.. అత్తారింట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాన్ని అనుభవిస్తూ.. కూలిపనులకు వెళుతూ పిహెచ్డి చేసిన మట్టిలో మాణిక్యమే ఈ భారతి.
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామానికి చెందిన సాకె భారతి చదువుపై ఉన్న మక్కువతో ఎన్ని ఆటంకాలు ఎదురైన ఎదుర్కొని రసాయన శాస్త్రంలో పిహెచ్ డి పట్టా పొందింది. తన కలను నెరవేర్చుకుంది.
అమ్మాయిలకు. చదివిందీ చాలు.. పెళ్లైయ్యాక ఎలాగే భర్తను, అత్తమామలను, పిల్లలను చూసుకోవాల్సిందే కదా అని పెళ్లి చేసేసే తల్లిదండ్రులు ఉన్నారు. వివాహం అయ్యాక వారే లోకంగా బతికేస్తుంటారు మహిళలు.