రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టాడు.
సఫారీ గడ్డపై రాహుల్ ద్రవిడ్ 11 టెస్ట్ల్లో 624 పరుగులు చేయగా.. తాజా ఇన్నింగ్స్తో కోహ్లీ ద్రవిడ్ రికార్డును అధిగమించాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ.. ద్రవిడ్ను వెనక్కునెట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ (15 మ్యాచ్ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఇప్పటివరకు 7 టెస్ట్లు ఆడిన కోహ్లీ.. 50కి పైగా సగటుతో 688 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేన ఫస్ట్ ఇన్నింగ్స్లో 223 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(201 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 79) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. పుజారా(77 బంతుల్లో 7 ఫోర్లతో 43) పర్వాలేదనిపించాడు.
ఈ ఇద్దరూ మినహా మరే బ్యాట్స్మెన్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా(4/73) నాలుగు, మార్క్ జాన్సేన్(3/55) మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో ఎయిడెన్ మార్కరమ్(8), కేశవ్ మహరాజ్(6) ఉన్నారు. బుమ్రా బౌలింగ్లో డీన్ ఎల్గర్(3) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
ఇదీ చదవండి: ద్రవిడ్ కోచ్ అయ్యాక టీమిండియాకు కలిసొస్తోంది! 8/8..