ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఇప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్ 26 న ప్రారంభించారు. పార్టీ స్థాపించి పట్టుమని పది సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే ఆప్ దేశరాజకీయాల్లో పలు సంచలనాలు సృష్టిస్తోంది. ఆప్ తొలిసారి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజార్టీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. తాజాగా పంజాబ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఏళ్లుగా గెలిపిస్తున్న కాంగ్రెస్ను కాదని ఆప్కు పట్టం కట్టారు. పంజాబ్ ఎన్నిల్లో ఆప్.. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు భారీ షాక్ ఇచ్చింది.
ఇక పంజాబ్లో గెలిచిన ఉత్సాహంతో.. ఆప్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి కేంద్రికరించింది. దేశంలో ప్రస్తుతం బలమైన విపక్షం లేకపోవడం కూడా అధికార పార్టీకి అనుకూల అంశంగా మారింది. ఇప్పుడు ఆప్.. ఆ స్థానాన్ని భర్తీ చేసే యోచనలో ఉంది. ఈ క్రమంలోనే త్వరలోనే జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించిన అంశాలు ఇవే!
దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్..
ఇదే సమయంలో దక్షిణాదిలో పాగా వేసుందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. దానిలో భాగంగా వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణపై కేజ్రీవాల్ ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణలో కేజ్రీవాల్ పాదయాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు మద్దతు పార్టీకి ఉంటుందని ఆప్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ పాదయాత్రలు చేపట్టనున్నట్లు సమాచారం.
పంజాబ్ ఫలితాలు తెలంగాణలో వస్తాయా..
పంజాబ్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ అధికారంలో ఉంది. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, చీటికి మాటికి ముఖ్యమంత్రులను మార్చే వైఖరి పట్ల ప్రజలు విసుగు చెందారు. పైగా పంజాబ్కు సమీపాన ఉన ఢిల్లీలో ఆప్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పంజాబ్ ప్రజలను ఆకర్షించాయి. ముఖ్యంగా సామాన్యులకు అతిముఖ్యమైన విద్య, వైద్యం వంటి అంశాల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు పంజాబ్ వాసులను విపరీతంగా ఆకర్షించాయి. అంతేకాక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మద్దతివ్వడం వంటి అంశాలన్ని పంజాబ్లో ఆప్కు కలిసి రావడంతో.. అక్కడ విజయం ఆప్ విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించిన అంశాలు ఇవే!
మరి తెలంగాణలో ఇలాంటి పరిస్థితే ఉందా.. ఆప్కు పంజాబ్ మాదిరి ఆదరణ లభిస్తుందా అంటే ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో విపక్షం మరి అంత స్ట్రాంగ్గా ఏం లేదు. ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇస్తామన్న సరే.. దాన్ని అందిపుచ్చుకునే నేతలు ఆ పార్టీలో లేరు. రేవంత్ దూకుడుగా వెళ్తున్న.. సీనియర్లు తనకి ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పలు చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వడమేకాక.. దుబ్బాక, హూజూరాబాద్లో విజయం సాధించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం తామే అని బీజేపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. పైగా రాష్ట్రంలో మరింత బలంగా పాతుకోపోయే ప్రయత్నంలో బీజేపీ బిజీగా ఉంది.
ఆప్ పరిస్థితి ఎలా ఉండనుంది…
గత కొన్నేళ్లుగా ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు అనే వాదన నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే వాదన జనాల్లోకి కూడా బలంగా వెళ్లిపోతుంది. పైగా ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా బలంగా ఉంటుంది. లోకల్ కేడర్ని నమ్మినంతగా ప్రజలు జాతీయ స్థాయి నాయకత్వాన్ని నమ్మరు అంటున్నారు రాజకీయ విశ్లేషకలు. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికి.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి అవకాశం ఇవ్వటం లేదని.. కేవలం లోక్సభ ఎన్నికల్లో మాత్రమే జాతీయ పార్టీలవైపు మొగ్గుచూపుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: సామాన్యుడి విజయం.. సీఎంని ఇంటికి పంపిన స్వీపర్ కుమారుడు!
పైగా తెలంగాణలో కేసీఆర్ వంటి బలమైన నాయకుడిని ఢీకొట్టడం అంత తేలిక కాదు. కేసీఆర్ ధాటికి జాతీయ పార్టీలే తట్టుకోలేకపోతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ తెలంగాణలో నెగ్గుకురావడం కల్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా ఆప్ తెలంగాణలో పోటీ చేస్తే రాజకీయ వ్యతిరేక ఓటు చీలి.. టీఆర్ఎస్కే ఎక్కువ మేలు కలుగుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి తెలంగాణలో ఆప్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొబోతుందే తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఎదురు చూడాలి. తెలంగాణలో కేజ్రీవాల్ పాదయాత్ర చేపట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.