ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ పెద్దలు ఉద్వాసన పలకనున్నారా..? ఇప్పడు ఇదే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీ కాషాయ పెద్దలు సోము వీర్రాజుపై కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయట. గతంలో అద్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తిరిగి నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో పార్టీ కార్యక్రమాల్లో సోము కాస్త వెనకంజలో ఉన్నట్లు కొందరు బీజేపీ నేతల మాట. అధికార వైసీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు తన వైఖరిని తెలియజేయటంలో విఫలమవుతున్నారని, అందుకే తనను తొలగించేందుకు ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. ఏపీలో బీజేపీ కేడర్ను ఉత్తేజితం చేయడంలో కన్నా ముందున్నారని అందుకే తిరిగి ఆయనను నియమించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు విషయంలోనూ సోము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే పెదవి విప్పుతున్నారు.
ఇక గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లోనూ సోము మార్క్ అస్సలు కంటికి కూడా కనిపించలేదని చెబుతున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో పార్టీని బలోపెతం చేయాల్సింది పోయి పట్టించుకున్న పాపాన పోలేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఇక ఎలాగైన త్వరలోనే అద్యక్షుడి మార్పు ఉండనుందని ఢిల్లీ పెద్దల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఏపీ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడి మార్చేందుకు అంతా సిద్దమైందట. మరి ఇంతకు తిరిగి కన్నాకే పగ్గాలు అప్పగిస్తారా లేదంటే కొత్త నాయకుడికి ఇస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.