త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికల నగరా మోగనుంది. నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ నిమిషమైనా రాజీనామా చేయవచ్చు. లేదంటే వైసీపీనే ఆయనపై వేటు వేయవచ్చనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేసి.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రఘురామా అడుగులు ఎటువైపు పడతాయి.. ఆయన బీజేపీలో చేరతారా.. లేక టీడీపీలో జాయిన్ అవుతారా అనే చర్చ సాగుతున్న సమయంలో తాజాగా ఓ కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అది కనుక వాస్తవరూపం దాలిస్తే.. ఇక నరసాపురంలో రఘురామ గెలుపు ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ వివరాలు..
ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రఘురామ.. ఇటు బీజేపీ, టీడీపీ కాకుండా జనసేనలో చేరతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీని వెనక బలమైన రాజకీయా కారణాలే ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నరసాపురంలో పార్టీల కన్నా కూడా కుల సమీకరణాలే బలంగా పని చేస్తాయి. ఇక ఈ నియోజకవర్గంలో రాజులు, కాపులే బలమైన సామాజిక వర్గాలు. వీరి మద్దతు ఎవరికి ఉంటే.. వారే నరసాపురంలో విజయం సాధిస్తారు.
ఇది కూడా చదవండి : నర్సాపురం లోక్ సభకి ఉప ఎన్నిక! రఘురామ కృష్ణరాజు మళ్ళీ గెలుస్తారా?
ఇక రఘురామ స్వయంగా రాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ క్రమంలో రఘురామ కనుక జనసేనలో చేరితే.. ఆయన సొంత సామాజిక వర్గం రాజులతో పాటు.. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సామాజిక వర్గం కూడా రఘురామకే మద్దతు తెలుపుతారని భావస్తున్నారు. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు రఘురామకు లభిస్తే.. ఇక ఆయన విజయం సాధించడం చాలా సులభం అంటున్నారు విశ్లేషకులు. ఇదే జరిగితే.. నరసాపురం ఉప ఎన్నికలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
రఘురామ జనసేనలో చేరితే.. ఆయనకు అన్ని విధాల లాభమే అంటున్నారు విశ్లేషకులు. మరి జనసేన రఘురామను స్వాగతిస్తుందా.. ఇందుకు దాని మిత్ర పక్షం బీజేపీ అంగీకరిస్తుందా.. అంటే.. అసలు పవన్ బీజేపీకి దూరం జరగాలని భావిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. బీజేపీతో మద్దతు కారణంగా పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆ పార్టీతో స్నేహపూర్వక సంబంధాలే కొనసాగించాల్సిన పరిస్థితి. అయితే తెలంగాణలో మాత్రం పవన్ టీఆర్ఎస్ కు దగ్గరగా కనిపిస్తున్నారు. బీజేపీకి మద్దతుగా ఇక్కడ ఎటువంటి కామెంట్స్ చేయకపోగా, టీఆర్ఎస్ నేతలను పొగుడుతున్నారు. ప్రభుత్వం కూడా పవన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంది. దీనిని బట్టి త్వరలోనే పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పేయనున్నారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి: బొత్స రిటైర్ మెంట్ కు రెడీ అయ్యారా? కారణం?
ఇదే సమయంలో రఘురామను పార్టీలోకి ఆహ్వానిస్తే.. జనసేన తరఫున ఓ అభ్యర్థి పార్లమెంట్ కు ఎన్నికవుతారని.. పార్టీ బలోపేతానికి ఇది అన్ని విధాల కలిసి వస్తుందని.. జనసేన నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారట. కనున రఘురామ రాజును పార్టీలో చేర్చుకుంటేనే మేలని సూచిస్తునట్లు తెలుస్తోంది. ఒకవేళ నరసాపుర ఉప ఎన్నిక వస్తే మాత్రం.. ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకలు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.