వికారాబాద్- ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేశాడు. పెళ్లితో ఏడు అడుగులు వేసి, పట్టిన చేతిని ఎప్పుడూ విడవనన్నాడు. కానీ వివాహమైన కొన్నాళ్లకే అతడికి ఆమెపై మోజు తీరిపోయింది. ఇంకేముంది నీవు అందంగా లేవంటూ ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.
ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవడంతో జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న టైంలో ఊహించని పరిణామంతో ఆ భార్య కుంగిపోయింది. భర్త వేధింపులు భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది.
తాండూరు మండలం జిన్గురి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్, అనిత కొన్నాళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత కొన్ని రోజులు వారి కాపురం సాఫీగా సాగిపోయింది. ఐతే రోజులు గడిచే కొద్దీ భర్త మహేష్ నిజ స్వరూపం బయటపడింది. నీవు అందంగా లేవంటూ భార్య అనితను వేధించడం మొదలుపెట్టాడు.
వెంటపడి ప్రేమించిపెళ్లి చేసుకున్న భర్త, ఇప్పుడు అందంగా లేవని హింసించడంతో ఆమె షాక్ అయ్యింది. మహేష్ వేధింపులను కొన్నాళ్లు మౌనంగా భరించిన అనిత చివరికి దారుణమైన నిర్ణయం తీసుకుంది. భర్త వేధింపులు భరించలేక ఎవరు లేని సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.