ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ ముంచుకొస్తోంది. ఒమిక్రాన్ మెల్ల మెల్లగా విస్తరిస్తుండటం ప్రపంచ దేశాలను మరోసారి ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అన్ని దేశాలకు విస్తరిస్తోంది.
ఈ నేపధ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి చాలా దేశాలు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్ వేస్తున్నారు. ఇక స్నేహితులను, బంధువులు సైతం మాస్క్ లేకుండా ఇంటికి లేదా ఆఫీస్ కు వస్తే ఎవ్వరు ఊరుకోవడం లేదు. సున్నితంగానైనా హెచ్చరిస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ మహిళ మాస్క్ ధరించని ఓ వృద్దుడిపై దాడికి దిగింది.
అసలేం జరిగిందంటే.. డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మాస్క్ ధరించకుండా భోజనం చేస్తున్న వృద్దుడిపై దాడి చేసింది. చాలా అమానుషంగా ఆ వృద్దుడిని తిట్టిందా మహిళ. ఇక్కడ ఆసక్తికరమై అంసం ఏంటంటే.. వృధ్దుడిపై దాడికి పాల్పడిన మహిళ మాస్క్ ధరించలేదు. ఫ్లైట్ ఉన్నవాళ్లంతా ఆమెను కూర్చొమని వారిస్తున్న వినకుండా ఆ వృద్దుడిని కొట్టిందా మహిళ. చివరికి విమాన సిబ్బంది ఆమెను అడ్డుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తారు.
మహిళ దాడిలో గాయపడిన ఆ వృద్దుడు ఆమెను నువ్వు జైలుకు వెళ్తావని హెచ్చరించాడు. విమానం అట్లాంటాలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడి పోలీసులు ఆ వృద్దుడిపై దాడి చేసిన మహిళ ప్యాట్రిసియా కార్న్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.