వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ‘మంగళవారం మరదలు’బయలు దేరింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యపై షర్మిల ప్రతి మంగళవారం నిరసన దీక్ష చేపడుతున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా కామెంట్ చేశారు. ఇక మంత్రి వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. చందమామను చూసి శునకాలు మొరగడం సాధారణమైన విషయమేనని అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు శునకాల్లా మొరుగుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఓ యువతి నిరసన తెలిపేందుకు వెళ్లగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆ యువతి వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి తన ఆవేదన వినిపించింది. తాము ధర్మబద్దంగానే వెళ్తున్నామని.. ఎలాంటి గొడవలు, దిష్టి బొమ్మలు కాల్చలేదని… ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రశ్నించినందుకు తమను అరెస్టు చేశారని వాపోయింది. దాంతో వైఎస్ షర్మిల అక్కడ ఉన్న సీఐ కి ఫోన్ ఇవ్వాల్సిందిగా కోరారు.. లైన్ లోకి వచ్చిన సీఐ వీళ్లు చెప్పా పెట్టకుండా ఎంఆర్సీ వద్దకు వచ్చారని.. మినిస్టర్ కాంప్లెక్స్ లోకి వెళ్లారని.. అందుకే వీళ్లను మందలించామని అన్నారు.
సీఐ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.. ఎంఆర్ సీ వద్దకు రాళ్లు, కర్రలు, బాంబులు పట్టుకు వచ్చారా? ఏదైనా పెద్ద గొడవ చేశారా అని నిలదీశారు. డెమాక్రసీలో ఆందోళన చేయడానికి కూడా రైట్స్ లేవా అని ప్రశ్నించారు. మినిస్టర్ అయితే ఏదైనా మాట్లాడవొచ్చా? ఆడవాళ్లపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మినిస్టర్ పై యాక్షన్ తీసుకోరు. నేను మీ మినస్టర్ పై కేసు పెడతాను.. అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై నిరసనలు తెలిపితే అలాంటి వారిని అరెస్ట్ చేయడం ఎంత న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.