ఏపీలో ఇప్పుడు ఎవరి నోట విన్నా సినిమా టికెట్ రేట్ల గురించే చర్చ నడుస్తోంది. సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించడాన్ని సినిమా రంగం వ్యతిరేకిస్తూనే ఉంది. అయితే ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం మరో రీతిలో స్పందించింది. సినిమా టికెట్ రేట్లను పెంచుతూ జీవో విడుదల చేసింది. కొందరు సినిమా థియేటర్ల యజమానులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ‘కోర్టు ఆదేశాల మేరకు.. ఫిబ్రవరి 28, 2017లో ఏర్పాటైన కమిటీ సూచనల మేరకు తాజాగా సినిమా రేట్లను నిర్ణయించాం’ అంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఉంది.
ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో సినీ ప్రేక్షకులకు రేట్లు ఒకింత షాక్ కు గురిచేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యేక అనుమతితోనే రేటును గరిష్టంగా రూ.250కి పెంచుకుంటున్నారు. ఈసారి నుంచి ప్రతి సినిమాకి రేటు అదే స్థాయిలో ఉండబోతోంది. ఏసీ థియేటర్ లో సినిమా టికెట్ రేటు మినిమం రూ.50 + జీఎస్టీ నుంచి గరిష్టంగా రూ.150+ జీఎస్టీగా ఉండబోతున్నాయి. నాన్ ఏసీ థియేటర్లలో రూ.30+ జీఎస్టీ నుంచి రూ.70+ జీఎస్టీగా ఉండబోతున్నాయి.
రిక్లైన్ సీట్లు ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధర రూ.200+ జీఎస్టీగా నిర్ణయించారు. ఐమ్యాక్స్, లార్జ్ స్క్రీన్స్ వంటి వాటిలో టికెట్ రేటు రూ.250+ జీఎస్టీగా ఉండబోతోంది. మల్టీప్లెక్సుల్లో మినిమం రూ.100+ జీఎస్టీ నుంచి గరిష్టంగా రూ.250+ జీఎస్టీ. రిక్లైన్ సీట్లు ఉన్న మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధర గరిష్టంగా రూ.300+ జీఎస్టీగా నిర్ణయించారు. ఏసీ థియేటర్ కు మెయిన్టినెన్స్ రూ.5, నాన్ ఏసీ థియేటర్ మెయిన్టినెన్స్ రూ.3 గా ఫిక్స్ చేశారు. సినిమా టికెట్ ధర పూర్తి వివరాలతో ముద్రించాలని ఆదేశించారు.