తెలంగాణలో కారుకు బ్రేక్ వేసేది తామే అని బీజేపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. కేసీఆర్ని గద్దె దించే సత్తా తమకే ఉందని బీజేపీ అగ్ర నేతలు సవాల్ చేస్తున్నారు.. దీనికి తగ్గట్టే పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు ఏకంగా అమిత్ షా హైదరాబాద్లో పర్యటించారు. దాంతో కమలం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే కారుకి బ్రేక్ వేయాలని ఉవ్విళూరుతున్న బీజేపీ అధిష్టానానికి.. పార్టీ నేతలే పెద్ద తలనొప్పిగా తయారవుతున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లిలో కమలం పార్టీలో మూడు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు.. పార్టీ పెద్దలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నేతల తీరు చూసి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శేరి లింగంపల్లిలో చోటు చేసుకున్న సంఘటన పార్టీలోని అంతర్గత కుమ్ములాటను బహిర్గతం చేసింది. ఆ వివరాలు..
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లిలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలకు చెందిన నియోజగకవర్గ నాయకులు, కార్పొరేటర్ అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ రోడ్డున పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గోపన్పల్లి రహదారిపై ఘర్షణకు దిగడంతో విబేధాల గురించి అందరికి తెలిసింది. అసెంబ్లీ బీజేపీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్తో సహా.. పలువురు నాయకులు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్రెడ్డితో జరిగిన వాగ్వాదం.. సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది.
ఇది కూడా చదవండి: Darshanam Mogilaiah: నన్ను బద్నాం చేయకండి.. నా నోట్లో మన్ను కొడితే పాపం తగుల్తది: కిన్నెర మొగిలయ్య
ప్రస్తుతం నియోజకవర్గం బీజేపీలో మూడు గ్రూపులు ఉండటంతో.. ఎవరి దగ్గరకు వెళ్లాలో కార్యకర్తలకు అంతుపట్టడం లేదు. శేరిలింగంపల్లిలో గజ్జెల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్లు ఈ మూడు వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రవి కుమార్ అనుచరుడైన, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ స్థలానికి యోగానంద్, మొవ్వ సత్యనారాయణ అనుచరులు వెళ్లి.. పరిసరాలను పరిశీలించి.. ఫోటోలు తీశారు. వీళ్లంతా గోపన్పల్లిలోని చెరువులను సందర్శించారు. ఆ సమయంలో వారిపై దాడి జరిగింది. అడ్డుకోబోయిన మొవ్వ సత్యనారాయణను కూడా వదల్లేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటు పార్టీలోను చర్చనీయాంశంగా మారింది. ఒక నాయకుడికి చెందిన ప్రైవేట్ స్థలాలు, భవనాల సందర్శనకు వెళ్లడంతోనే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శేరిలింగంపల్లి నేతలు దీని గురించి అధిష్టానానికి ఫిర్యాదులు అందజేశారు. మరి పార్టీ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.