గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలేవైనా కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. ఇదే అదునుగా కొంత మంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి రెండు ముఠాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
పాతబస్తీలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఈ ముఠాను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కూడా విక్రయిస్తున్నారు. మొత్తం నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కొద్దిరోజుల నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం మలక్పేట, ఆసిఫ్నగర్లలో దాడులు నిర్వహించింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 70 నకిలీ ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, 50 టీకా సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పారిపోయారని, వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు.
ఏడాది క్రితం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పి.లక్ష్మణ్ మలక్పేటలోని ఆస్మాన్గఢ్లో కొన్నేళ్లుగా హోంకేర్ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. నెగెటివ్ రిపోర్టులు ఇచ్చి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసి ఒక్కో సర్టిఫికెట్కు రూ.2,000-రూ.3,000 వరకు డబ్బులు వసూలు చేశాడు.
రెండవ కేసులో, అరెస్టయిన వ్యక్తి మహ్మద్ తారిఖ్ హబీబ్ మురాద్నగర్లో ఇమేజ్ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అవసరం ఉన్న వాళ్ల వివరాలు సేకరించి అఫ్జల్సాగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే కుమారి వద్దకు పంపించేవాడు. ఆమె కొవిన్ పోర్టల్లో నమోదు చేసేది. తారిఖ్, ఇర్ఫాన్, కుమారిలతోపాటు ట్రావెల్ ఏజెంట్లను అరెస్టు చేశారు. ఈ కేసులపై తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపారు.