Patient: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బ్రేయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి ఆపరేషన్ చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి పుర్రెను తిరిగి అతికించకుండానే డిశ్చార్జ్ చేసింది. పేషంట్ చనిపోతే ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్, చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు అతడ్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అతడికి పరీక్షలు చేసిన ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలని నిశ్చయించుకున్నారు. ఆపరేషన్లో భాగంగా అతడి తలనుంచి పై భాగంలోని పుర్రెను కోసి పక్కకు తీశారు. అయితే, మల్లేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చనిపోతాడేమోనని ఆసుపత్రి యజమాన్యం భయపడిపోయింది. అతడు చనిపోతే ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందని భావించింది. పేషంట్ పరిస్థితి బాగోలేకపోయినా డిశ్చార్జ్ చేయటానికి సన్నహాలు చేసింది.
అతడు బాగానే ఉన్నాడంటూ తప్పుడు నివేదకను సిద్ధం చేసింది. ఆరోగ్య శ్రీ సిబ్బందితో కుమ్మక్కై డిశ్చార్జి ఏర్పాట్లు మొదలుపెట్టింది. అర్థం పర్థంలేని కారణాలు చెప్పి, తప్పుడు డేట్లతో రిపోర్టులు సిద్ధం చేసింది. ఆ వెంటనే కుటుంబసభ్యులపై బెదిరింపులకు దిగి, పేషంట్ను ఎంజీఎంకు తరలించేలా చేసింది. అయితే, ఆపరేషన్ సమయంలో తొలగించిన పుర్రె పై భాగం ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండిపోయింది. పేషంట్ మాత్రం ఎంజీఎంలో చేరాడు. ఈ సంఘటనపై ఆరోగ్య శ్రీ సిబ్బంది, ఆసుపత్రి యజమాన్యం తమ తప్పు లేదని అంటున్నారు. అయితే, పేషంట్ను ఆపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చారని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మల్లేశ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : BJP Leaders: శేరిలింగంపల్లిలో బీజేపీ నాయకుల వర్గపోరు.. నడిరోడ్డుపై కొట్టుకున్నారు!