హైదరాబాద్- పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ప్రాణాలకు ప్రమాదం.. క్యాన్సర్ కారకం అని ఎన్ని విధాలుగా ప్రచారం చేసినా జనాల్లో మాత్రం ఆశించిన మేర మార్పు రావడం లేదు. పోనీ ఇలా పొగ తాగేవారికి.. దాని వల్ల తలెత్తె సమస్యల గురించి తెలియదా అంటే.. తెలుసు.. తెలిసే దీనికి అలవాటిపడుతున్నారు. వ్యసనంగా మారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పొగ తాగడం వల్ల.. అనారోగ్య సమస్యలు తలెత్తి మరణించిన వారిని చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది అందుకు పూర్తి భిన్నమైన సంఘటన. వేలెడంత లేని ఈ సిగరెట్.. ఓ వ్యక్తిని సజీవ దహనం చేసింది. ఎలాగో తెలియాలంటే ఇది చదవండి.
మధుకర్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా మంచానికే పరిమితం అయ్యాడు. కుటుంబ సభ్యులంతా ఎవరి పనికి వారు వెళ్లగా మధుకర్ ఒంటరిగా ఇంట్లోనే ఉండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కూడా ఎప్పటిలాగానే కటుంబ సభ్యులు వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. మధుకర్ కి సిగరెట్ తాగే అలవాటు ఉంది. అనారోగ్యంతో మంచానికే పరిమితం అయినప్పటికి.. ఆ అలవాటును మాత్రం మానుకోలేకపోయాడు.
ఈ క్రమంలో మంచలో ఉన్న మధుకర్ సిగరెట్ తాగడానికి ప్రయత్నించాడు. అయితే అనుకోకుండా.. సిగరెట్ కు ఉన్న నిప్పు రవ్వలు మంచంపై ఉన్న బట్టలపై పడటంతో అగ్గి రాజుకుంది. ప్రమాదాన్ని మధుకర్ గుర్తించలేదు. ఈలోపు మంటలు పెద్దగా అయ్యి.. మధుకర్ పడుకున్న మంచానికి కూడా అంటున్నాయి. ప్రమాదాన్ని గుర్తించినప్పటికి.. నడవలేని పరిస్థితిలో ఉండటంతో.. మధుకర్ కి కూడా మంటలు అంటుకున్నాయి.
ఒక్కసారిగా ఇంటిలో నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. చుట్టుపక్కల వారు ఇంట్లోకి చేరుకునే లోపే మధుకర్ శరీరం చాలా వరకు కాలిపోయింది. కొనఊపిరితో వున్న అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే పరిస్థితి పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూ మధుకర్ శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మంగళ్ హాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిగరెట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.