బుల్లితెర ప్రేక్షకులకు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్.. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో.. ఇవాళ్టి (ఫిబ్రవరి 26వ తేదీ) నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకాబోతోంది. ఈ రియాల్టీ షో ప్రత్యేకత ఏమంటే 24 గంటలూ ప్రసారం కావడం. ఇంత వరకూ గంట, గంటన్నర సేపు మాత్రమే రియాల్టీ షోను చూస్తూ వచ్చాం. అయితే బిగ్ బాస్ కి ఉన్న ఫాలోయింగ్ వల్ల ఓటీటీ వేదికగా నెటిజన్లకు మరింత చేరువ చేసేందుకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంను ప్రసారం చేసేందుకు నిర్వాహకులు నిర్ణయించారు.
ఈ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గతంలో ఆయన బిగ్బాస్ హౌస్ను బ్రోతల్ హౌస్గా అభివర్ణించడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఓటీటీ వేదికగా ప్రారంభం కానున్న రియాల్టీ షోపై అవే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. తాము బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా ఇప్పటికే లేఖలు రాశామని నారాయణ గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెడదామని తాము ప్రయత్నిస్తే తమ పరిధి కాదంటున్నారని అన్నారు. దీంతో తాము కోర్టులో కేసులు వేశామని చెప్పారు. బిగ్బాస్ రియాల్టీ షోను నిలిపివేయాలంటూ డిజిటల్ క్యాంపెయిన్ను ప్రారంభించినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఇది చదవండి: భీమ్లా నాయక్ 1st డే కలెక్షన్స్. నైజంలో ఊచకోత! కానీ..!
బిగ్ బాస్ షో లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని నారాయణ అన్నారు. 200 కెమెరాలు పెట్టాం అంటున్నారని, అయితే, అందులో ఏం జరుగుతుందో అంతా ఎడిటింగ్తో తీసేస్తారని చెప్పారు. అసలు ఈ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి యూత్ కి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు నారాయణ. దాన్ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు అన్నమయ్య, రామదాసు లాంటి భక్తిరస చిత్రాల్లో నటించిన అక్కినేని నాగార్జున ఇలాంటి బిగ్బాస్ వంటి షోకు వ్యాఖ్యాతగా చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.