తెలంగాణలోని మద్యం ప్రియులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. తాజాగా బీరు ధరలను పెంచుతూ కొత్త ధరలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి బీరు ధరలను ఒక్కో బీరుపై రూ. 20 పెంచుతున్నట్లు ప్రతిపాదనలు అమలుచేసినట్లు తెలుస్తుంది. కొంతకాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు బీరు ధరలను పెంచాలని కోరిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఇటీవల చర్చలు జరిపారు.
అనంతరం ఒక్కో బీరు ధరపై రూ. 20 పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం లైట్ బీరు ధర రూ.140 ఉండగా దాన్ని రూ. 160కి, స్ట్రాంగ్ బీర్ ధర రూ.150 ఉండగా దానిని రూ. 170 చేయనున్నట్లు తెలుస్తోంది. అదీగాక.. ఈ ఏడాది వేసవి వేడికి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయని అందులోనూ బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
గతేడాది వరకు కోవిడ్ కారణంగా తగ్గుముఖం పట్టిన బీర్ల అమ్మకాలు ఈ ఏడాది జోరందుకున్నాయి. పెరిగిన ఎండలు, వేడి గాలుల నుంచి చల్లగా సేదతీరేందుకు జనాలు నీళ్లకు బదులు బీర్లు లాగిస్తున్నారు. గతేడాది మే నెలతో పోల్చితే ఈ ఏడాదిలో బీర్ల అమ్మకాలు 90% పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ ఏడాది బీర్ల అమ్మకాలలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్దానంలో ఉండగా.. రెండో స్థానంలో వరంగల్ నిలిచింది. మరి పెరిగిన బీర్ల ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.