రాజస్థాన్- సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో ఐతే ఈ కేటిగాళ్లు మరీ రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి చాలా మంది మోసపోతున్నారని మీడియాలో వస్తున్నా.. ఇంకా కొత్త వాళ్లు మోసపోతూనే ఉన్నారు. సోషల్ మీడియా లో పరిచయం అయిన వారిని నమ్మొద్దని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా.. ఎక్కడో ఒక చోటు ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఓ సైబర్ ముఠా చేతిలో మోసపోయిన యువతి ఏకంగా కోట్ల రూపాయలు పోగొట్టుకుంది. కొంత జాలి, మరి కొంత ఆశ ఈమెను మోసపోయేలా చేశాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని సామై మాధోపూర్ నగరానికి చెందిన ఓ యువతికి 2017లో రెబెకా క్రిష్టినా అనే విదేశీ మహిళ ఫేస్బుక్ ద్వార పరిచయం అయ్యింది. వీళ్లిద్దరు తరుచుగా ఫెస్ బుక్ మెస్సెంజర్ లో మాట్లాడుకునే వారు. ఇద్దరు తమ తమ కుటుంబ, వ్యక్తిగత వివరాలు సైతం పంచుకునే చనువు ఏర్పడింది. ఈ క్రమంలో ఓ రోజు ఉన్నట్లుండి విదేశీ మహిళ రెబెకా క్రిష్టినా తన భర్త చనిపోయాడని, ప్రస్తుం తాను ఒంటరిగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. తనకు బంధువులుగాని,పెద్దగా స్నేహితులు గాని లేరని చెప్పింది. తనకు ఈ మద్యే క్యాన్సర్ సోకిందని వైద్యులు చెప్పారని, తాను 6నెలల కంటే ఎక్కువ కాలం బతకనని రాజస్థాన్ యువతితో ఏకరువు పెట్టింది.
ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే ఆత్మీయురాలిగా అనిపిస్తున్నావని, దేవుడిచ్చిన చెల్లివి నీవే అని ప్రేమను కురిపించింది. తన ఆస్తి మొత్తం 3.9 మిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో సుమారు 29 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పుకొచ్చింది. తాను క్యాన్సర్ తో చనిపోయే ముందే తన ఆస్తిని నీకు ఇచ్చేస్తానని రాజస్థాన్ యువతికి చెప్పింది విదేశీ మహిళ. ఇక తనకు క్యాన్సర్ అని చెప్పగానే ఆమెపై జాలి చూపించింది రాజస్థాన్ యువతి. ఆమెను ఓదార్చి, ధైర్యం చెప్పింది. అంతే కాదు ఆమె ఆస్తిని తీసుకునేందుకు అంగీకరించింది.
ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆస్తిని నీ పేరు మీదకు మార్చేశాననీ, డబ్బు, నగలను కూడా పంపిస్తున్నానని రాజస్థాన్ యువతికి చెప్పింది రెబెకా. తన అడ్వకేట్, ఆదాయ పన్ను అధికారులు నీకు ఫోన్ చేస్తారనీ, వాళ్లు అడిగిన వివరాలు ఇస్తే ఆస్తిని భారత్ లోని మీ కరెన్సీ రూపంలోకి మార్చి దానికి మిమ్మల్ని యజమానిగా చేస్తారని చెప్పుకొచ్చింది. రెండు రోజుల తరువాత ఓ ఇద్దరు వ్యక్తుల నుంచి ఆ యువతికి ఫోన్ కాల్స్ తో పాటు ఈమెయిల్స్ వచ్చాయి. ఆస్తిని మీ పేరు మీదకు మార్చాలంటే కొన్ని పత్రాలు కావాలంటూ అడిగి తీసుకున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాక్స్,ప్రోపర్టీ ట్యాక్స్, ఫారిన్ ఎక్ఛేంజ్ ట్యాక్స్ అంటూ పలు సందర్బాల్లో ఆ యువతి నుంచి ఏకంగా 2 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ డబ్బును మొత్తం 55 బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లించారు.
ఈ క్రమంలో వారి మాటలు, వారి ప్రవర్తనపై ఆ యువతికి అనుమానం రావడంతో తాను మోసపోయానని చివరికి గ్రహించింది. వెంటనే దీనిపై జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందా యువతి. ఈ ఘటన 2017వ సంవత్సరంలో జరిగింది. అప్పటి నుంచి విచారణ చేస్తున్న పోలీసులు ఎట్టకేలకు నాలుగేళ్ల తరువాత నిందితున్ని పట్టుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీకి చెందిన నీరజ్ సూరి ఈ సైబర్ క్రైమ్కు సూత్రధారి అనీ, అతడికి కొందరు నైజీరియన్లు సహకరించారని పోలీసులు తేల్చారు. ఈ ఆదివారం అతడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి డబ్బును రాబట్టి బాధితురాలికి అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. అందుకని ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.