గత కొన్ని రోజులుగా నడుస్తోన్న పీఆర్సీ వివాదానికి ఏపీ ప్రభుత్వం శుక్రవారం ముగింపు పలికింది. ఉద్యోగులుకు 23.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. అలానే పెండింగ్ లో ఉన్న కరువు భత్యాన్ని (డీఏ) కూడా విడుదల చేయడానికి అంగీకరించింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగుల్లో తీవ్ర సందిగ్దత నెలకొంది. ఈ కొత్త ఫిట్ మెంట్ వల్ల వాస్తవంగా జీతాలు తగ్గుతున్నాయని.. ప్రభుత్వం జీతాల్లో కోత విధించి.. డీఏని దానికి కలిపి.. వేతనం పెరిగినట్లు చూపిస్తోందని ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక పెన్షన్ తీసుకునే వారికి కూడా కొత్త ఫిట్ మెంట్ వల్ల నష్టం తప్ప లాభం లేదని వాపోతున్నారు. అసలు ఇంతకు ప్రభుత్వం ఉద్యోగులు జీతాలు పెంచిందా.. లేక తగ్గించిందా అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు…
ప్రస్తుతం ఏపీ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) లభిస్తోంది. అంటే వాస్తవంగా 2018 నాటికి పే రివిజన్ కమిషన్ సిఫార్సుల్ని ఆమోదించి.. పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. కానీ ఆలస్యం అవుతున్నంద వల్ల అప్పటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మధ్యంతర భృతిని 20 శాతంగా ప్రకటించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఐఆర్ ను 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండేళ్ల తర్వత ప్రకటించిన ఫిట్ మెంట్ ఐఆర్ కన్నా 4 శాతం తక్కువగా ప్రకటించారు. దీని వల్ల ఉద్యోగులు తీసుకునే జీతంలో మూడున్నర శాతం వరకు కోత పడనుంది. అదే సమయంలో ఇంటి అద్దె భత్యం(హెచ్ ఆర్ ఏ), సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్సు) రూపంలోనూ మరికొంత నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ డీఏలు ఇచ్చి.. తగ్గే జీతంతో కవర్ చేస్తున్నారు. .
కొత్త వేతన సవరణ ప్రకటన సమయంలో మధ్యంతర భృతి కన్నా ఫిట్మెంట్ తక్కువగా ప్రకటించడం ఇదే తొలిసారి అని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు చెబుతున్నారు. పీఆర్సీతో పాటు పెండింగులో ఉన్న అన్ని కరవు భత్యాలు (డీఏలు) 2022 జనవరి జీతంలో కలిపి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అన్ని అలవెన్స్ సౌకర్యాల్లో డీఏ అత్యంత కీలకమైనది. కరువు భత్యంగా చెప్పుకునే ఈ డీఏని ప్రతి ఆరునెలలకోసారి ఎంతో కొంత ఇస్తుంటారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్లు ఇది ఉంటుంది. అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డీఏలను పెండింగ్ లో పెట్టారు. వాటన్నింటిని ఇప్పుడు వచ్చే నెల నుంచి ఇవ్వాలని నిర్ణయించుకుంది.
2021, జూలై 1 నాటికి పెండింగ్ లో ఉన్న డీఏ 20.2 శాతాన్ని అందరికీ ఇస్తారు. ప్రస్తుతం ప్రకటించిన ఫిట్ మెంట్ వల్ల ఎంత జీతం తగ్గిపోతుందో.. ఆ మొత్తం ఈ డీఏలతో కవర్ అవుతుంది. మహా అయితే వెయ్యి, రెండు వేల రూపాయలు పెరుగుతుంది. ఫలితంగా జీతం పెరిగిందన్న భావన కలుగుతుంది. కానీ వాస్తవంగా చూస్తే.. ఉద్యోగులు జీతాన్ని నష్టపోతున్నారు. ప్రభుత్వ విధానం వల్ల జీతంలో కోతతో పాటు డీఏ పూర్తి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు ఉద్యోగులు.
కరవు భత్యం వేరు, పీఆర్సీ వేరు అని.. పెండింగు డీఏలు పీఆర్సీకి కలిపి జీతంలో పెరుగుదల ఉన్నట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థికశాఖ విశ్రాంత ఉద్యోగులు కొందరు విశ్లేషిస్తున్నారు. పెండింగులో ఉన్న డీఏలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పీఆర్సీ వరకే లెక్కిస్తే కొత్త వేతన సవరణ వల్ల ఇప్పుడు అందుకుంటున్న జీతాలు కూడా రావని విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పీఆర్సీపై సీఎం జగన్ కీలక ప్రకటన
హెచ్ ఆర్ ఏ తగ్గిస్తే.. మరింత కష్టం
ప్రస్తుత ఫిట్ మెంట్ ప్రకటనలో ఉద్యోగులకు ఇచ్చే హెచ్ ఆర్ ఏ గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ కార్యదర్శుల కమిటీ (సీఎస్) ఇచ్చిన చేసిన సిఫార్సుల ఫలితంగా హెచ్ ఆర్ ఏ బాగా తగ్గినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ 5-50 లక్షల జనాభా ఉన్న నగరాల్లో హెచ్ఆర్ఏను 16 శాతంగా ప్రకటించింది. మిగతా నగరాల్లో 8 శాతం చాలని సిఫార్సు చేసింది. పీఆర్సీ ప్రకటన ముందు వరకు ఉద్యోగులు ఎక్కడ పని చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా.. 12-16 శాతం హెచ్ఆర్ఏ ఇస్తున్నారు.
విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, మరి కొన్ని నగరాల్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా 5 లక్షలకు మించి జనాభా లేరు. సీఎస్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తే.. దాదాపు 80 శాతం మందికిపైగా ఉద్యోగులు 5-6 శాతం హెచ్ఆర్ఏ ను కోల్పోనున్నారు. పైన పేర్కొన్న నగరాల్లో పని చేసే వారు మాత్రమే 16 శాతం హెచ్ఆర్ఏ పొందనున్నారు. ఇప్పటి వరకు హెచ్ఓడీలు, సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు 30 శాతం హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు. వీరిందరికి ఇప్పుడు అందేది 16 శాతం మాత్రమే.
ఉదాహరణ..
ఒక డిప్యూటీ తహసీల్దార్కు (గెజిటెడ్ హోదా) మరికొందరు నాన్గెజిటెడ్ ఉద్యోగులకు 2013 పీఆర్సీ ప్రకారం కనీస మూలవేతనం రూ.28,940 ఉంది. వీరు 27 శాతం ఐఆర్, ఇతర అన్ని అంశాలతో కలిపి ప్రస్తుతం రూ.49,932 జీతం పొందుతున్నారు.
అదే ఉద్యోగికి తాజా పీఆర్సీ ప్రకారం 23 శాతం ఫిట్మెంట్, సీఎస్ కమిటీ ప్రకటించిన ఇంటి అద్దె భత్యం పరిగణలోకి తీసుకుని అన్నీ కలిపి లెక్కిస్తే జీతం రూ.46,707 అవుతుంది. అంటే జీతం తగ్గిపోతోంది. ప్రస్తుతం డీఏలతో కలిపి కూడా కొత్త జీతం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ డీఏలు కూడా కలిపితే జీతం రూ.52,501 అవుతుంది. పీఆర్సీ వల్ల జీతం తగ్గుతోందని, ఎప్పుడో ఇవ్వాల్సిన కరవు భత్యం ఇప్పుడు ఇవ్వడం వల్ల మాత్రమే జీతం పెరుగుతున్నట్లుగా చూపుతున్నారని విశ్లేషిస్తున్నారు.
పెన్షనర్లకు తీవ్ర నష్టం..
27 శాతం మధ్యంతర భృతి తీసుకుంటున్న పెన్షనర్లకు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన 23.29 శాతం ఫిట్ మెంట్ వల్ల 3.7 శాతం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ బేసిక్, ఐఆర్ తో కలిసి 63, 688 రూపాయలు డ్రా చేసుకుంటుంటే.. కొత్త పీఆర్సీ వల్ల వచ్చే నెల నుంచి ఆ పెన్షనర్ కు అందేదీ 62,187 రూపాయలు మాత్రమే. ఇలా వచ్చే పెన్షన్ స్థాయిని బట్టి తగ్గుతుంది. రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ పే ప్రతి సంవత్సరం ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్ తో పెరుగుతుంది. కానీ పెన్షనర్స్ బేసిక్ పెన్షన్ పీఆర్సీతో మాత్రమే మారుతుంది. ఫలితంగా సీనియర్ పెన్షనర్ల కన్నా.. రిటైర్ అయిన జూనియర్ పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ వస్తుంది.
ఇక వయసు పెరిగే కొద్ది.. ఉద్యోగులకు అడిషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పేరుతో పెన్షన్ పెంచుతారు. వయసు పెరిగే కొద్ది.. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.. ఆస్పత్రి ఖర్చులు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ఇది ఇస్తున్నారు. అయితే దీని గురించి పీఆర్సీలో ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రస్తుతం రాష్ట్రలో 70 ఏళ్లు దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తున్నారు. అయితే కేంద్రంలో 80 ఏళ్లు పైబడిన వారికి అడిషన్ క్వాంటమ్ ఆప్ పెన్షన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాల్సిందిగా కార్యదర్శుల కమిటీ సూచించింది. దీనివల్ల 70-75 సంవత్సరాలు వయసు ఉన్న వారు 15 శాతం.. 75-80 ఏళ్ల వయసు ఉన్న వారు 20 శాతం పెన్షన్ నష్టపోతారు.
పే స్లిప్ వస్తే తప్ప ఓ క్లారిటీ రాదు…
ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది.. కానీ చాలా అంశాల్లో అస్పష్టత ఉంది. ప్రభుత్వం పీఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది.. ఏం మార్పులు చేసిందన్నది వచ్చే నెల మొదటి తేదీన వచ్చే పే స్లిప్ చూస్తే కానీ అర్థం కాదు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.