న్యూ ఢిల్లీ- మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ వ్యక్తి గురించి ప్రస్తావించారంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అది కూడా సామాన్యుడి గురించి మోదీ మన్ కీ బాత్ లో చెప్పడం ఆసక్తికరంగా మారింది. అందులోను ప్రధాని ప్రస్తావించిన వ్యక్తి తెలంగాణకు చెందిన వారు కావడంతో అయన ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. అవును తెలంగాణలోని భువనగిరి జిల్లాకు చెందిన విఠలాచార్య గొప్పతం గురించి చెప్పారు మోదీ.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్కీ బాత్లో పుస్తకాల గొప్పతనం గురించి చెప్పారు. ఈ క్రమంలోనే మోదీ తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గురించి ప్రస్తావించారు. విఠలాచార్యపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. అన్నట్లు కూరెళ్ల విఠలాచార్య యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేమల గ్రామంలో 1938 జూలై 9న జన్మించారు. లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా పలు కళాశాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు.
ప్రధాని ఏమన్నారంటే.. మన దేశం ఎంతో అసాధారణ ప్రతిభతో నిండి ఉంది.. అటువంటి వారి చేతలు ఇతరులను కూడా ఏదైనా చేయాలనిపించే ప్రేరణను అందిస్తాయి.. అటువంటి వారే తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య.. ఆయన వయసు 84 ఏళ్లు.. కలలను సాకారం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని ఆయన నిరూపించారు.. ఆయన చిన్నతనం నుంచే పెద్ద గ్రంథాలయాన్ని నడపాలనే కోరిక ఉండేది.. కానీ అప్పుడు దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉంది.. అప్పటి పరిస్థితుల వల్ల ఆయన చిన్ననాటి కల కలగానే ఉండిపోయింది.. అని వివరించారు మోదీ.
ఈ క్రమంలో ఆయన పెద్దయ్యాక లెక్చరర్ అయ్యారు.. తెలుగు భాష గురించి అధ్యయనం చేసి ఎన్నో పుస్తకాలు రచించారు.. ఆరేడేళ్ల కింద తన కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేశారు.. తన సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.. జీవితకాలపు ఆదాయాన్ని అందులో పెట్టారు.. తర్వాత ప్రజలు కూడా ఆయనకు తమ వంతు సహకారాన్ని అందించారు..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలంలోని ఈ గ్రంథాలయంలో దాదాపు ప్రస్తుతం రెండు లక్షల పుస్తకాలున్నాయి.. చదువుకోవడానికి తను పడ్డ కష్టాలు.. ఇంకెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా విఠలాచార్య చెబుతుంటారు.. ఆయన స్ఫూర్తితో చుట్టు పక్కల గ్రామాల్లోను గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు.
మోదీ తెలంగాణకు చెందిన విఠలాచార్య గురించి మన్ కీ బాత్ లో ప్రస్తావించడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గురించి ప్రస్తావించారని.. అటువంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారన్నారు.. కలలను సాకారం చేసుకునే విషయంలో వయసు గురించి పట్టించుకోవద్దనడానికి ఆయనే ఓ ఉదాహరణ అని కిషన్ రెడ్డి ట్వీట్లో కామెంట్ చేశారు.
PM Sh @narendramodi, during his #MannkiBaat programme called on fellow countrymen to take inspiration from people like Dr Kurella Vittalacharya ji from #Telangana.
And at the age of 84, he is an example that age does not matter when it comes to the realization of your dreams. pic.twitter.com/0ifz31COKr
— G Kishan Reddy (@kishanreddybjp) December 26, 2021