తమిళనాడులో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ… వినూత్న నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇటీవల భారీ వర్షాలు సైతం లెక్కచేయకుండా ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ సమస్యలు తలెత్తినా స్వయంగా వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పంథా చాటుకున్నారు.
గురువారం ఉదయం సీఎం స్టాలిన్ తన నివాసం నుంచి అసెంబ్లీకి వెళ్తుండగా.. టీటీకే రోడ్డులో ఓ యువకుడు ‘సీఎం సర్ హెల్ప్ మీ’ అని రాసిన ప్లకార్డు పట్టుకుని కన్పించాడు. ఆ యువకుడ్ని చూసి తన కాన్వాయ్ ఆపేశారు. వాహనం దిగి స్వయంగా ఆ యువకుడితో మాట్లాడారు. ఆ యువకుడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఆ యువకుడి పేరు ఎన్. సతీశ్. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు. ఇటీవల కొంతకాలంగా నీట్ విషయంలో సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న పోరాటానికి సతీశ్ కూడా ప్రభావితుడయ్యాడు.
ఇది చదవండి : ఉద్యోగులు ఏమైనా ఉగ్రవాదులా?: చంద్రబాబు
నీట్ పరీక్షలను వ్యతిరేకించినందుకు సతీశ్.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాడు. దేశవ్యాప్తంగా నీట్ మినహాయింపులు కోరుతూ కేంద్రానికి సూచించాలని ఆయన సీఎంను కోరారు. దీనిపై సీఎం స్టాలిన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోను తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్విటర్ వేదికగా పంచుకుంది. ఆ మధ్య కూడా స్టాలిన్ రోడ్డు మధ్యలో కాన్వాయ్ ఆపి మాస్కుల్లేకుండా తిరుగుతున్నవారికి మాస్క్లు పంచిపెట్టిన విషయం తెలిసిందే.