ఈ కాలంలో పక్కవారు ఏమైనా తమకు ఏం సంబంధం లేదని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. రోడ్డు పై ప్రమాదాలు జరిగితే.. సెల్ఫీలు తీసుకుంటూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలన్న కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ తాము చనిపోతూ పలువురి ప్రాణాలు కాపాడుతు మానవత్వం ఉన్నవారు కూడా ఉన్నారు. తాము చనిపోయే ముందు శరీర అవయవాలను దానం చేసి మరొకరు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అనుకోని ప్రమాదంతో ఓ చిన్నారికి నిండు నూరేళ్లూ నిండాయి. బోసి నవ్వులతో కన్నవారి కళ్లల్లో ఆనందం నింపాల్సిన చిన్నారి.. బ్రెయిన్ డెడ్ తో ఆ ఇంట విషాదం నింపింది. ఆవయవ దానంతో ఆ చిన్నారి ఐదుగురికి ప్రాణదానం చేసింది.వివరాల్లోకి వెళితే..
నోయిడాలో ఇటీవల రోలి ప్రజాపతి అనే ఆరేళ్ల పాప గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. వెంటనే పాపను తల్లిదండ్రులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. ఆ పాపను కాపాడేందుకు డాక్టర్స్ ఎంతో కష్టపడ్డారు.. కానీ బతికించలేకపోయారు. పాపకు బ్రెయిన్ డెడ్ కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యులు కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి తెలిపి, వారి కౌన్సెలింగ్ చేశారు.
ఎంతో దుఖఃంలో ఉండి కూడా అవయవ దానానికి రోలి ప్రజాపతి తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వైద్యులు ఆమేరకు చర్యలు చేపట్టి ఐదుగురు ప్రాణాలను కాపాడారు. చిన్నారి కాలేయం, మూత్రపిండాలు, కార్నియా, గుండె కవాటం రెండింటిని తీసుకొని ఇతరులకు అమర్చారు. ఢిల్లీలోని ఎయిమ్స్ చరిత్రలో అతి చిన్న వయసులో ఉన్న చిన్నారి అవయవ దానం చేయడం ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. మా పాప చనిపోయినా.. ఆ ఐదుగురిలో జీవించే ఉంటుందని తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.