ఓవైపు ఇంధన ధరలు.. మరోవైపు నిత్యావసరాల ధరలు శరవేగంగా పెరిగిపోతూ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం సామాన్యులు ఏది కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగానే.. చమురు సంస్థలు సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ.. శనివారం నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన సిలిండర్ ధరతో ప్రస్తుతం గ్యాస్ ధర 1052కు పెరిగింది. పెంచిన ధర వెంటనే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను కొన్ని రోజుల క్రితమే పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్ ధర 2,460 నుంచి 2563.50 రూపాయల వరకు పెరిగింది. మరి గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.