ఇటీవల విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో చిన్న తప్పిదాల వల్ల ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. స్వామి వివేకానంద ఎయిర్ పోర్టులో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. గురువారం రాత్రి రాయ్ పూర్ విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ కి ప్రమాదం జరిగినట్లు.. అది ల్యాండింగ్ చేసే సమయంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు రాయపూర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాకేష్ సహాయ్ తెలిపారు.
రాత్రి పూట ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ అన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా.. ఎందుకు జరిగిందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో చనిపొయిన వారి కుటుంబాలలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై డీజీసీఏ, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించాయి.