ఈ ప్రపంచంలో ప్రేమకున్న శక్తి మరిక దేనికి లేదు. రెండక్షరాల ఈ మాట.. ఎన్నో చరిత్రలు సృష్టించింది. ఎందరినో చరిత్రలో నిలిపింది. ప్రేమించిన వారి కోసం రాజ్యాలు, వైభోగాలు.. ఆఖరికి ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్నవారు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలకు లెక్కేలేదు. కాలంతో పాటు ప్రేమ స్వభావం కూడా మారుతూ వస్తోంది. ఒకప్పుడు తాము ప్రేమించిన వారు తమకు దక్కకపోయినా.. సంతోషంగా ఉంటే చాలనుకునేవారు. కానీ నేటికాలంలో.. నాకు దక్కని వారు మరి ఎవ్వరికి దక్కకూడదనే విపరీత ధోరణి పెరిగిపోతుంది. దాంతో ప్రేమ పేరిట నిత్యం అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇక ప్రేమించిన వారి కోసం సాహసాలు చేసే వారు.. ఆ కాలంలో ఉన్నారు.. నేడు ఉన్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. ప్రేమించిన వాడి కోసం ఓ యువతి ఏకంగా దేశ సరిహద్దులు దాటి.. మధ్యలో భయంకరమైన అడవులను దాటుకుని.. భారత్లో అడుగు పెట్టింది. ప్రియుడిని కలుసుకుంది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. అయితే ఆమె చేసిన సాహసం వృథా అయ్యింది. అక్రమంగా దేశంలో ప్రవేశించిందని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Viral Video: టర్నింగ్ లో పెను ప్రమాదం.. ప్రాణాలతో భయటపడ్డ జనాలు! వీడియో వైరల్!
బంగ్లాదేశ్కు చెందిన కృష్ణ మండల్ (22) అనే యువతికి కొన్నేళ్ల క్రితం కోల్కతా చెందిన అభిక్ మండల్తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కృష్ణ మండల్ని భారత్కి రావాల్సింది కోరాడు ఆమె ప్రియుడు. పాస్పోర్ట్, వీసా, విమానం టికెట్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ మాత్రమే కాక డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చవుతాయని భావించిన కృష్ణ మండల్ సాహసం చేయడానికి నిర్ణయించుకుంది.
ఇది కూడా చదవండి: Aurangabad: పట్టాలపై నిద్రపోయిన మహిళ.. పైనుండి దూసుకెళ్లిన రైలు!
ఈ క్రమంలో తన ప్రియుడి కోసం సరిహద్దుల్లో రాయల్ బెంగాల్ పులుల నివాసమైన దట్టమైన సుందర్బన్ అడవుల గుండా ప్రయాణించి, గంటపాటు నదిలో ఈది భారత్లోకి ప్రవేశించింది. ప్రియుడిని కలుసుకుంది. ఆ తర్వాత వారిద్దరూ కోల్కతాలోని కాళీఘాట్ ఆలయంలో మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. ప్రియుడి కోసం ఆమె చేసిన సాహసం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఆమెను అభినందించారు కూడా. ప్రేమించిన వాడిని కలవడమే కాక.. వివాహం కూడా చేసుకోవడంతో.. ఆనందంలో మునిగి పోయింది కృష్ణ మండల్. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.
ఆమె దేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే నేరంపై పోలీసులు కృష్ణ మండల్ను సోమవారం అరెస్టు చేశారు. ఆమెను తిరిగి బంగ్లాదేశ్ హై కమిషనర్కు అప్పగిస్తామని వారు తెలిపారు. ఇక ప్రేమించిన వాడి కోసం ఇంత సాహసం చేసి ఇండియా వస్తే.. చివరకు ఇలా అయ్యిందే అని వాపోతుంది కృష్ణ మండల్. తిరిగి భర్తను కలుసుకోవాలంటే.. అధికారికంగా రావాల్సి ఉంది. ఈ సారి అలానే చేస్తాను అంటుంది కృష్ణ మండల్. ఇక కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్కు చెందిన ఓ బాలుడు ఇలాగే తనకిష్టమైన చాక్లెట్ కోసం సరిహద్దుల్లో నదిని ఈది భారత్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ బాలుడిని కూడా అధికారులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. మరి ప్రియుడి కోసం కృష్ణ మండల్ చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Narendra Modi: వైరల్: తల్లి ఫొటో కోసం ప్రధాని మోదీ రిస్క్!